హైదరాబాద్ : పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అద్భుతమైన తీరును కనబరిచింది. ఈ రంగంలో తొమ్మిది నెలలు ముందుగానే తెలంగాణ వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 248 శాతం లక్ష్యాన్ని చేరగా, మరో 27 రాష్ట్రాలు మాత్రం తమ లక్ష్యాలను 50 శాతం కూడా చేరుకోలేదు. దేశ వ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే పునరుత్పాదక ఇంధన వనరుల్లో 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. వీటిలో తెలంగాణలో 248 శాతం, రాజస్థాన్ 119 శాతం, కర్ణాటక 107 శాతం, అండమాన్ నికోబార్ దీవులు 129 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎంబర్ క్లైమేట్ అనే ఓ కంపెనీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో వరుసగా 38 శాతం, 46 శాతం మాత్రమే లక్ష్యాలను సాధించాయి. గుజరాత్ 97 శాతం, తమిళనాడు 75 శాతం సాధించింది.
తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. అతి తక్కువ వ్యవధిలోనే పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో తన సామర్థ్యాన్ని పెంచుకుంది. 2014లో తెలంగాణ మొత్తం స్థాపిత సామర్థ్యం 8 మెగావాట్లు ఉంటే.. మార్చి 31, 2022 నాటికి 4,919.19 మెగావాట్లకు చేరుకుంది. ఇది గొప్ప విజయమని ఎంబర్ క్లైమెట్ పేర్కొన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించి, పెంచుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
స్మాల్ హైడ్రో పవర్ – 90.87 MW
పవన శక్తి– 128.10 MW
బయో పవర్ – 219.74 MW
సోలార్ పవర్ – 4520.48 MW
మొత్తం – 4919.19 MW