చేనేత వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు కోసం తెలంగాణ నేతన్నలు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. చేనేత కార్మికుల సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోస్ట్కార్డులను రాస్తున్నారు. శనివారం మంత్రి కేటీఆర్ స్వదస్తూరితో రాసిన లేఖ స్ఫూర్తితో వేల మంది ప్రధాని మోదీకి పోస్టుకార్డులను రాసి పంపుతున్నారు. చేనేత కార్మికులకు బాసటగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రధానికి లేఖలు రాస్తున్నారు. పోస్టుకార్డు ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తున్నది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 23: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత కార్మికులకు బాసటగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఓవైపు స్వదేశీ, ఆత్మనిర్భర భారత్ వంటి వాటిని వల్లెవేసే కేంద్రం ఆచరణలో విఫలమవుతున్నదని లేఖలో ప్రస్తావించారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చేనేత కార్మికులకు పోస్టుకార్డులను పంపిణీచేశారు. నల్లగొండ జిల్లా చౌటు ప్పల్లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేనేత కార్మికులతో పోస్టుకార్డులు రాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవైనగర్ జెండాచౌరస్తాలో నేతన్నలు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ లేఖలు రాశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద పోస్టు కార్డులపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో పద్మశాలీ సంఘ సభ్యులు సంతకాల సేకరణ చేశారు.