Artisan | రాష్ట్రంలోని ప్రజలకు వెలుగులు పంచే సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీవితాలు అంధకారంలో ఉండొద్దని సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో గొప్ప ఆలోచన చేశారు. ఆయన ఆదేశాలతో విద్యుత్ సంస్థలు వారిని విలీనం (అబ్జార్బ్) చేసుకొన్నాయి. వారిని ‘ఆర్టిజన్’ అనే ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించారు. వారికి నాలుగు వేలు ఉన్న జీతాన్ని నాలుగింతలకు పెంచి గౌరవప్రద జీవితం ఉండేలా చూశారు. ఉద్యోగులతో సమానంగా 7 శాతం ఫిట్మెంట్ కూడా ఇచ్చారు. అయినా.. కొంతమంది ఆర్టిజన్లు తమకు ఆ ఫిట్మెంట్ సరిపోదంటూ సమ్మెకు దిగుతుండటంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. మిగతా ఆర్టిజన్లతోపాటు కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్న ఆర్టిజన్లపై మండిపడుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్లు 2016 వరకు కాంట్రాక్టు ఉద్యోగులు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు మధ్యన కాంట్రాక్టర్ ఉండేవాడు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల చేతికి చాలా తక్కువ జీతం అందేది. మధ్యలో ఉన్న దళారులే ఎక్కువ కాజేసేవారు. సీఎం కేసీఆర్ వారి పరిస్థితిని మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని, దళారీ వ్యవస్థ లేకుండా నిర్ణయం తీసుకొన్నారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు సహకారంతో అప్పటివరకూ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ.. ఆర్టిజన్ల పేరిట వారిని సంస్థల్లోకి విలీనం (అబ్జార్బ్) చేశారు. అప్పటి నుంచి వారికి పూర్తిస్థాయి జీతభత్యాలు అందుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్నప్పుడు రూ. నాలుగు వేలు మాత్రమే అందే జీతం ఆర్టిజన్గా మారగానే నాలుగింతలు (రూ.16వేలు) పెరిగింది.
2022 ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీపై నాలుగు రోజుల క్రితమే ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యుత్తు యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉద్యోగులు, ఆర్టిజన్లు అనే తేడా చూపకుండా అందరికీ యాజమాన్యాలు 7 శాతం ఫిట్మెంట్ ప్రకటించాయి. దీంతో ఒక్కో ఆర్టిజన్కు రూ.5 వేల నుంచి రూ.9 వేల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఆర్టిజన్లకు వారి పర్సనల్ పేను కూడా బేసిక్ (స్కేల్)లో కలుపుతున్నారు. అనారోగ్యానికి గురైతే రూ.14 లక్షల వరకు (అన్ని రకాలుగా కలుపుకొని) వెసులుబాటు కల్పించారు. ఇక గతంలో ఎలాంటి అవకాశం లేకపోయినా కారుణ్య నియామకాలకుకూడా యాజమాన్యాలు పచ్చజెండా ఊపాయి. రెగ్యులర్ ఉద్యోగికి 0-5 ఏండ్లలోపు ఒకే ఒక ఇంక్రిమెంట్ ఇస్తుండగా.. ఆర్టిజన్లకు మాత్రం 2 ఇంక్రిమెంట్లు ఇస్తుండటం విశేషం. ఇదీగాక వీటికి డీఏ అదనం. ఇలా ఆర్టిజన్లకోసం ఏటా మొత్తం రూ.120 కోట్లకుపైగానే వెచ్చిస్తున్నారు. ఇవన్నీ చూసుకొంటే నిజంగా తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని కొంతమంది ఆర్టిజన్లు సంతోషం వ్యక్తంచేస్తుంటే.. ఇంకా కావాలంటూ మరికొంతమంది ఆర్టిజన్లు సమ్మెకు దిగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఉద్యోగులు, ఆర్టిజన్లు అందరూ కొత్త పీఆర్సీపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.. కొందరు ఆర్టిజన్లను రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తుండటంపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
సమ్మెకు దిగడం సరికాదు
ఆర్టిజన్ కార్మికులు ఏకపక్షంగా సమ్మెకు దిగడం సరికాదు. ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపజేయాలనడం అసమంజసం. గతంలో స్టాండింగ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేసిన తర్వాత కొత్త నినాదం ఎత్తుకోవడం మంచిదికాదు. ఏపీఎస్ఈబీని రద్దుచేసి నాలుగు విద్యుత్తు సంస్థలుగా విభజించే నాటికి పనిచేస్తున్న వారికే ఆయా రూల్స్ వర్తిస్తాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆర్టిజన్ కార్మికులను సంస్థలో విలీనం చేశారు. 25 శాతంతో మొదటి పీఆర్సీ ఇవ్వగా, తాజాగా 7 శాతంతో రెండో పీఆర్సీ ఇచ్చారు. పర్సనల్ పేను కొత్త స్కేల్లో మెర్జ్ చేయడంతో 70 -80 శాతం ఫిట్మెంట్ లభించింది. రెగ్యులర్ ఉద్యోగులతో సహా మెడికల్, ఇన్సూరెన్స్లు వర్తింపజేస్తున్నారు. 5 ఏండ్లు పూర్తయితే సీనియార్టీ ప్రకారం పదోన్నతులు వస్తాయి. పైగా ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఆర్టిజన్లను తప్పుదోవ పట్టిస్తే.. అంతిమంగా కార్మికులకే నష్టం.
– కోడూరి ప్రకాశ్, బీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావు
సమ్మెకు మా సంఘంతో ఏం సంబంధం లేదు. సమస్యలు సమ్మెలతో పరిష్కారం కావు. పర్సనల్ పేను విలీనం చేయడంతో ఆర్టిజన్ల బేసిక్ డబుల్ అయ్యింది. దీంతో డీఏ పెరిగినప్పుడల్లా ఆర్టిజన్లకే లాభం జరుగుతున్నది. గతంలో ఆర్టిజన్లకు మెడికల్ సౌకర్యం లేదు. తాజాగా రూ.2 లక్షలకు ఇప్పించాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల్లా.. ఒకేసారి శాశ్వత ఉద్యోగులకు గల ప్రయోజనాలను ఆర్టిజన్లు ఆశించడం సరికాదు. సమ్మెకు వెళ్తే నష్టమే తప్ప లాభం లేదు.
– శ్రీధర్, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ -327 సెక్రటరీ జనరల్
1104 ఉద్యోగులు, ఆర్టిజన్లు సమ్మెకు దూరం
విద్యుత్తురంగ పరిస్థితులు, ప్రభుత్వ ఆలోచనల నేపథ్యంలో 7 శాతం ఫిట్మెంట్, సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న సింగిల్ మాస్టర్ స్కేల్, సర్వీసు ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు సాధించాం. భవిష్యత్తులో ఆర్టిజన్ల ఉద్యోగ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి, మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు 1104 చిత్తశుద్ధితో ఉంది. ఈ నెల 25 నుంచి ఒకట్రెండు సంఘాలు సమ్మెకు దిగడాన్ని 1104 పూర్తిగా విభేదిస్తున్నది. 1104లో సభ్యత్వం పొందిన ఉద్యోగులు, ఆర్టిజన్లు ఈ సమ్మెకు దూరంగా ఉండాలని కోరుతున్నాం.
– జీ సాయిబాబు, ప్రధాన కార్యదర్శి, టీఈఈ 1104 యూనియన్, టీఎస్పీఈ జాక్ చైర్మన్
దేశంలోనే ఎవరికీ జరగని లబ్ధి
దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి.. స్కేలు, హెచ్ఆర్ఏ, డీఏ తదితర అలవెన్సులు అన్నీ ఇచ్చారు. కోర్టు తీర్పులన్నీ వ్యతిరేకంగా ఉన్నా.. కేసీఆర్ కార్మికులకు న్యాయం చేశారు. అయినా..కొంతమంది సమ్మెకు వెళ్లాలని నిర్ణయించడం సరైంది కాదు. అందరూకూడా సంస్థ మనుగడ, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెకు దూరంగా ఉండాలి.
– ఎంఏ వజీర్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్పీఈయూ-1535
సమ్మెలో పాల్గొనడం లేదు
ఈ నెల 25 నుంచి తలపెట్టిన సమ్మెలో 1104 సభ్యులు పాల్గొనాలని హెచ్82 యూనియన్ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. 1104 నాయకులు సమ్మెలో పాల్గొనడం లేదు.. యూనియన్ ఆర్టిజన్ సభ్యులు యథాతథంగా విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
–జే వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్, నారాయణపేట 1104 సబ్ డివిజన్
– మనోహర్, ఆర్టిజన్ గ్రేడ్-2, పటాన్చెరు డివిజన్