మోదీ మాటల వెనుక కుట్ర : మంత్రి జీ జగదీశ్రెడ్డి
రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంటులో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాకపోయినా, మోదీ వ్యాఖ్యలు ముమ్మాటికీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని, రాష్ట్రంపై ఇంత విషమా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మోదీ విషం కక్కుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు గొప్పగా ఉన్నాయని కేంద్రం, ఇతర రాష్ర్టాల మంత్రులు ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, సీఎం కేసీఆర్ ఇచ్చినట్టుగా మంచినీళ్లు, రైతుబంధు, పింఛన్లు ఇస్తామని నాయకులు హామీలిస్తున్నారని చెప్పారు. కానీ మోదీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందనట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు.
మాతృనేలపై ప్రేమలేని రాష్ట్ర బీజేపీ: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ప్రధాని మోదీ పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే అదే మాట మాట్లాడుతూ తెలంగాణపై అకసును వెళ్లగకుతున్నాడని, అమరుల త్యాగాలను హేళన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. విభజన సరిగ్గా జరగలేదనడం ద్వారా మోదీ తెలంగాణను ఎంత శత్రువుగా చూస్తున్నాడో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ వైఖరి మోదీ మాటలతో నగ్నంగా బయటపడిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లోనే తెలంగాణపై ఉన్న ఈర్ష్యను బయటపెట్టుకున్నారని విమర్శించారు. రాజ్యసభలో తెలంగాణను అవమానించిన మోదీతో బేషరుతగా క్షమాపణ చెప్పిస్తారో, తామే చెప్తారో తేల్చుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు మాతృనేల మీద ఏమాత్రం ప్రేమ లేదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ మోదీ దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని, ఆయన ముందు బీజేపీ కుట్రలు చెల్లవని చెప్పారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు రాజీనామా చేయాలి : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అయినా రాష్ట్రంపై విషం చిమ్మడం ప్రధాని మోదీ దిగజారుడుతనానికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రతినిధులకు చీమూ నెత్తురు ఉంటే తమ పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీకి ఆది నుంచీ తెలంగాణపై ద్వేషమే ఉన్నదని, అది ఆయన నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. విభజన గురించి ఇన్ని చెప్తున్న మోదీ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా ఎందుకు కల్పించలేదని నిలదీశారు. తెలంగాణ నుంచి సీలేరుతోపాటు ఏడు మండలాలను లాక్కున్నారని విమర్శించారు. ప్రధాని హోదాలో ఉండి నిస్సిగ్గుగా ఒక రాష్ట్రంపై విషం కక్కడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ సమాజం మోదీని, బీజేపీని అసహ్యించుకుంటున్నదని చెప్పారు.
రాష్ట్రంపై మోదీది ఓర్వలేనితనం: మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, తన సొంత రాష్ట్రం గుజరాత్ను అభివృద్ధిలో మించిపోతుండటం చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ అక్కసు వెళ్లగక్కారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాజ్యసభలో ప్రధాని తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజలను అవమానించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల వీరోచిత పోరాటాల, విద్యార్థి అమరవీరుల త్యాగాలు, సబ్బండ వర్ణాల రాజీలేని పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను అవమానించడం తగదని హితవు చెప్పారు. భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఆందోళనకు దిగడాన్ని మోదీ గ్రహించాలని చురకలేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారని ప్రశ్నించారు.