సాగులో హరిత విప్లవం, చెరువులో నీలి విప్లవం, పాడితో శ్వేత విప్లవం, గొర్రెలతో గులాబీ విప్లవం, ఆయిల్పామ్తో పసుపు విప్లవం.. ఇదీ తెలంగాణ సాధించిన ఘనత
– మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏండ్లుగా రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రతి చిన్న, సన్నకారు రైతుకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లనే వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ నేడు మొదటి స్థానానికి చేరుకొన్నదని వెల్లడించారు. శుక్రవారం నోవోటెల్లో ‘అగ్రికల్చరల్ డాటా మేనేజ్మెంట్ ఎక్సేంజ్’ (ఎడెక్స్)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ రైతుగా సీఎం కేసీఆర్కు రైతులకు ఏం కావాలో, ప్రభుత్వం తరఫున ఏం ఇవ్వాలో తెలుసని అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల్లో తెలంగాణ 24వ స్థానంలో, ధాన్యం ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉండేదని గుర్తుచేశారు.ఈ ఏడాది మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ ఘనత కేవలం 9 ఏండ్లలోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
లేబర్ నుంచి.. పాలమూరు రైతులుగా..
రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలనే సంకల్పంతో సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు సీఎం కేసీఆర్ సాహించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టును నాలుగేండ్లలోనే పూర్తిచేసి రైతులకు కానుకగా ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ వ్యవసాయ విధానాల వల్లనే ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్, నేడు ధాన్యం ఉత్పత్తిలో తనదైన ముద్ర వేస్తున్నదని తెలిపారు. నాడు వ్యవసాయం లేక పాలమూరు బిడ్డలు వలస వెళ్లేవారని, దేశంలో ఎక్కడికెళ్లినా వారిని ‘పాలమూరు లేబర్’గా సంబోధించేవారని గుర్తు చేశారు. ఆ ముద్రను సీఎం కేసీఆర్ శాశ్వతంగా చెరిపివేసి ‘పాలమూరు రైతులు’గా వారికి కొత్తగా నామకరణం చేశారని కొనియాడారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు విద్యుత్తును అందిస్తున్నదని, ఇందుకు ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతులకు నేరుగా రూ.73 వేల కోట్లు అందించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయానికి సంబంధించి సమాచార మార్పిడి కోసం (ADeX)ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతీయ వ్యవసాయ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
ధాన్యం నుంచి ఆయిల్ పామ్ దాకా..
తెలంగాణలో రైతాంగానికి సమయానికి ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతున్నామని, వారి అవసరాలకు తగ్గట్టుగా సాగునీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటి ఫలితంగా ఐదు విప్లవాలు సాకరమయ్యాయని అన్నారు. అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి ద్వారా ‘గ్రీన్ రెవల్యూషన్’ సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ పండించే నాణ్యమైన పత్తికి మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉన్నదని సదరన్ ఇండియన్ మిల్స్ అసోసియేషన్ స్వయంగా వెల్లడించిందని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించడంతో భూగర్భ జలాలను పెరిగాయని పేర్కొన్నారు.
ప్రభుత్వమే మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందించి ప్రోత్సహించడంతో మత్స్య సంపద ఉత్పత్తిలోనూ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచి ‘బ్లూ రెవల్యూషన్’ సాధించిందని వివరించారు. అలాగే పాడి రైతులకు ప్రభుత్వం మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తూ డెయిరీ, పౌల్ట్రీ రంగాలకు సబ్సిడీలు ఇస్తున్నదని తెలిపారు. విజయ డెయిరీ ద్వారా పాడి రైతులకు లీటరకు రూ.4 అధికంగా ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ చర్యల ఫలితంగా ‘వైట్ రెవల్యూషన్’ సాధ్యమైందన్నారు. యాదవ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయడంతో మాంసం ఉత్పత్తి పెరిగి ‘పింక్ రెవల్యూషన్’ సాకారమైందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆయిల్పామ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదని, రాబోయే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని దీని ద్వారా ‘ఎల్లో రెవల్యూషన్’ సాధ్యమవుతుందని చెప్పారు.