కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చేస్తున్న వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉందని, ఆయన అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) ఆరోపించారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో కన్నెపల్లి పంప్హౌస్ ( Kannepally) మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని కోరుతూ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం, ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఈ లేఖ రాసినందుకు గానూ తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెట్టాలని, వారిని బొక్కలో వేయాలని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా ఇరిగేషన్ శాఖలో పనిచేసి, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు రైతుల పక్షాన ఇచ్చిన మంచి సలహాలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకోలేదని విమర్శించారు.
నదిలో దాదాపు 98 టీఎంసీల నీరు వృథాగా కొట్టుకుపోతోందని అన్నారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, పనికిరాదని, లక్ష కోట్లు మునిగిపోయాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే తాము చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ప్రకారం మేడిగడ్డను రిపేర్ చేయవచ్చని అసెంబ్లీలో హరీష్ రావు, కేటీఆర్ అనేకసార్లు మాట్లాడారని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీలో కుంగింది ఒకే ఒక పిల్లర్ అని, దానికి సంబంధించిన 7వ బ్లాక్ మొత్తాన్ని తీసేసి పునర్నిర్మించినా రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాం రెడ్డి, ఏలేటి కృష్ణ రెడ్డి ఉన్నారు .