మంచిర్యాల : దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఫుజాయిరహ్ సిటీని వరద నీరు ముంచెత్తింది. ఆ సిటీలో నివాసముంటున్న తెలంగాణ వాసి ఉప్పు లింగారెడ్డి(35) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామం. లింగారెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తోటివారు తెలియజేశారు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితమే దుబాయ్కు లింగారెడ్డి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంతూరు తెప్పించేలా చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి తల్లి లక్ష్మీభాయ్, భార్య శిరీష రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డెడ్బాడీని స్వదేశానికి తీసుకురావడానికి కూడా తమ వద్ద అంత డబ్బు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. గత వారం రోజుల నుంచి దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.