KCR | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీనేతగా కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదించగా.. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. ఈ సందర్భంగా సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు వ్యక్తంచేశారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో కేసీఆర్ శాసనసభాపక్షం భేటీకి రాలేకపోయారు. ఆయనకు పరిచర్యలు చేస్తూ దవాఖానలోనే ఉండిపోయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎల్పీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి సమావేశం నిర్వహించాలని కోరారు. శాసనసభ తొలి రోజు సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయిన కేటీఆర్ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీఆర్ఎస్ నేతలు కొందరు ప్రమాణం చేయలేదు. వారిలో మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి ఉన్నారు. వీరు ఇంకా తమ పదవులకు రాజీనామా చేయకపోవటంతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేకపోయారు. మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ముందే నిర్ణయించున్న షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో లేకపోవటంతో ఆయన కూడా ప్రమాణం చేయలేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఎల్పీ సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ భవన్లోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్లోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. పార్టీ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ప్రత్యేక బస్సులో బయలుదేరి అసెంబ్లీ ముందు గన్పార్క్లోని తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తరువాత వారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి హాజరయ్యారు. సుదీర్ఘ పోరాటం తరువాత కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పిన డిసెంబర్ 9వ తేదీ తమకు అత్యంత పవిత్రమైన రోజు అని, తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జై తెలంగాణ నినాదాలు వెళ్లారు.