KTR | తాగు, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాలను తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా వేదికగా సోమవారం రాత్రి ఆవిష్కరించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా అతితక్కువ సమయంలో మిషన్ భగరీథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తాగు, సాగునీటి కష్టాలను తీర్చిన విధానంపై అమెరికాలోని ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు వివరించనున్నారు. అమెరికా నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జరిగే సదస్సులో పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, దాంతో అందుతున్న ఫలాలతో ఇతర ప్రణాళికలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనా ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తాగు, సాగునీటి సమస్యలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ రెండు ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టి.. రికార్డు సమయంలో పూర్తి చేశారు.
అమెరికాలోని శాక్రమెంటో వేదికగా 2017లో జరిగిన ఏఎస్సీఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికలపై వివరించారు. తెలంగాణ ప్రభుత్వ భారీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, అందరికీ సురక్షిత తాగునీరు అందించే మిషన్ భగీరథ లాంటి బృహత్ పథకాల గురించి ఆ రోజు కేటీఆర్ వివరించినప్పుడు ఏఎస్సీఈ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక 2022లో రాష్ట్రంలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం, తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అంటూ ప్రశంసించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపింది.