హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐటీ శాఖ తన వెబ్సైట్లను ఆధునీకరించింది. వినియోగదారుల అవసరాల రీత్యా మరింత మెరుగుపర్చిన ఈ వెబ్సైట్ల (https:// it.telangana.gov.in/, https:// data.telangana.gov)ను రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ప్రారంభించారు. ప్రధాన వెబ్సైట్లో ఐటీ శాఖ నిర్వహించే కార్యకలాపాల వివరాలతోపాటు పాలసీ డాక్యుమెంట్లు, వార్షిక నివేదికలకు సంబంధించిన లింకులు, వార్తలు, ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని హైదరాబాద్ నుంచి ఇతర పట్టణాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలయ్యేలా వెబ్ పేజీలను తీర్చిదిద్దినట్టు వివరించారు. డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, అసిస్టెంట్ డైరెక్టర్ ముడుంబై మాధవ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.