హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. సోమవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమంలో పీఎల్ శ్రీనివాస్ మంత్రి కేటీఆర్ను కలిసి ప్రభుత్వ పథకాలపై తాను చేస్తున్న ప్రచార కార్యక్రమాల గురించి వివరించారు. దాంతో మంత్రి కేటీఆర్ అభినందించారు.
అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సృజనాత్మక పథకాలను ఇతర రాష్ట్రాలు, దేశం అనుసరిస్తుండటం మనందరికీ గర్వకారణమని, వాటిని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
దేశంలో ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని పీఎల్ శ్రీనివాస్ తెలిపారు. వరి సాగులోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారని అన్నారు.