హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనువైన ప్రాంతమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ఇండో కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వారికి వివరించారు.
కుల వృత్తులపై ఆధారపడిన వారికి ప్రభుత్వ పరంగా చేయూతను అందించి ప్రోత్సహించాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో సరైన నీరు, విద్యుత్ ఉండేది కాదని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు తో కాళేశ్వరం వంటి నూతన సాగునీటి ప్రాజెక్టు లు నిర్మించుకున్నామని వివరించారు.
పెద్ద సంఖ్యలో నీటి వనరులు అందుబాటులోకి రావడంతో ప్రతి నీటి వనరులో చేప పిల్లలను విడుదల చేస్తున్న విషయాన్ని వివరించారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా వల్ల వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్నాయని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
నూతన పరిశ్రమల ఏర్పాటు కు తెలంగాణ అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండటం వల్ల అనేక దేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణా లో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధులు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ప్రత్యేక సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రిని కలిసిన వారిలో ఇండో కెనడా కో ఆర్డినేటర్ త్రిభువన్ ఆనంద్, వికాస్ గుప్త, కల్పేష్ జోషి తదితరులు ఉన్నారు.