సంగారెడ్డి : తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైద్యోపకరణాల తయారీ, పరిశోధనల కోసం హైదరాబాద్కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీ(ఎస్ఎంటీ) సంస్థను ప్రారంభించారు. ప్రాజెక్టు సంజీవని పేరుతో స్టెంట్ల తయారీ యూనిట్ను ఎస్ఎంటీ సంస్థ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచం వెనుకబడినా ఎస్ఎంటీ వేగం తగ్గలేదు. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ, పరిశోధన సంస్థ ఎస్ఎంటీ అని కొనియాడారు. దేశంలో మెడికల్ డివైసెస్ తయారీతో ఔషధాలు, వైద్యోపకరణాల ధరలు తగ్గాయి. బయో ఆసియా సదస్సులో వైద్యోపకరణాల తయారీ సంస్థలను కలిశానని గుర్తు చేశారు. దేశంలో 80 శాతం వైద్యోపకరణాలు విదేశాల నుంచి తెస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్, దాయర గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్లతో సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంటీ) పరిశ్రమ స్టెంట్ల ఉత్పత్తిని చేపట్టింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏటా 1.2 మిలియన్ల కార్డియాక్ స్టెంట్లు, 2 మిలియన్ల కార్డియాక్ బెలూన్లు ఉత్పత్తి చేయనున్నారు. వృద్ధుల కోసం టీఏవీఐ, పిల్లలు, గుండె రంధ్రం ఉన్న వారి కోసం ఆక్టూడర్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి స్టెంట్లు తయారు చేస్తారు. గుండె సంబంధిత బాధితులకు వేసే స్టెంట్లు ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దీంతో రోగులపై ఆర్థికంగా భారం పడుతున్నది. ఇప్పుడు ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనుండటంతో తక్కువ ధరకు స్టెంట్లు లభిస్తాయి.
The state-of-the-art facility of Sahajanand Medical Technologies facility (@SMTStents) will further strengthen the country’s ecosystem in technological innovation of structural, interventional and closure cardiac devices reducing import dependency in this niche segment. pic.twitter.com/w4GnZq4TbP
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 15, 2022