సిద్దిపేట, మార్చి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇక్కడి పారదర్శక విధానాన్ని పలు రాష్ర్టాల ప్రతినిధులు పరిశీలించి ప్రశంసిస్తున్నారు. ఈజీఎస్ సామాజిక తనిఖీలను పర్యవేక్షించి, పారదర్శక విధానాలు తెలుసుకొని తమ ప్రాంతాల్లో అమలు చేసేందుకు దేశంలోని పలు రాష్ర్టాల నుంచి 26 మంది సోషల్ ఆడిట్ డైరెక్టర్లు గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఈజీఎస్ సోషల్ ఆడిట్ సమావేశానికి హాజరయ్యారు. సోషల్ ఆడిట్ ఎలా జరుగుతున్నది? ఎలా నిర్వహిస్తున్నారు?
ఏయే అంశాలపై ప్రజాదర్బార్లో చర్చించారు. ఇలా ప్రతి అంశాన్ని బృందం సభ్యులు ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు. వీరి సందేహాలను జిల్లా, మండల అధికారులు నివృత్తి చేశారు. తెలంగాణలో ఉపాధిహామీ పనులు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని బృందం సభ్యులు కొనియాడారు. నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మెచ్చుకున్నారు. పనుల నిర్వహణ, కూలీలకు పని కల్పించడంలో పారదర్శకంగా వ్యవహరించడం, నిధులను సద్వినియోగం చేసుకొని హరిత, స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి చేయడం, చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసుకోవడంతోపాటు నిరంతర పర్యవేక్షణతో పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని బృందం ప్రతినిధులు ప్రశంసించారు.