వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ముందుచూపు కారణంగా తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో గొర్రెలకు నట్టల నివారణ మందులను మంత్రి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మంచినీటి చేపల ఉత్పత్తి (fish production)లో ప్రపంచంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయం తర్వాత గొర్రెలు, పశువుల పెంపకానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ టాప్లో ఉందని స్పష్టం చేశారు. గొల్ల, కురుమల ఆర్థిక బలోపేతానికి సబ్సిడీ గొర్రెల పంపిణీని చేపట్టాలని అధికారులకు సూచించారు.నల్లజాతి పొట్టేళ్ల పెంపకంపై దృష్టిసారించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గొర్రెల పంపిణీకి రూ.12 వేల కోట్లు ఖర్చు చేయగా ఏడు లక్షల మంది గొల్ల, కురుమల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అన్నారు.
50 ఏళ్లు నిండిన గొల్ల, కురుమలకు ఫించన్లు, ప్రమాదవశాత్తు గాయపడితే పరిహారం అందించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనల మూలంగా కేవలం 9 ఏళ్లలో అభివృద్ధి, ఆరోగ్యం, విద్య సూచీలలో జాతీయ స్థాయిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. అనంతరం వనపర్తి మండలం మెంటెపల్లి గ్రామంలో రామాలయంలో నిర్మిస్తున్న ధ్వజ స్థంభం , విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, సతీమణి సింగిరెడ్డి వాసంతి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
పెబ్బేరుకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరారు. 5 వ వార్డు కౌన్సిలర్ గోపి బాబుతో పాటు మరో 150 మంది పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఖిల్లాఘణపురం మండలం ఎమ్మార్పీఎస్ నాయకులు యాదగిరి, వెంకటేశ్, చెన్నయ్య, యాదయ్య తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.