హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, పలు వినూత్న పథకాలతో వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నదని దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ దివ్యాంగుల శాఖ ఇటీవల అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి రెండు రోజులపాటు సెన్సిటైజేషన్ వర్క్షాప్ను నిర్వహించింది.
ఇండోర్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ తరఫున శైలజ హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు అన్ని పథకాలు, ఆర్థిక చేయూత కార్యక్రమాల్లో వారికి 25 శాతం అదనంగా లబ్ధి చేకూరుస్తున్నట్టు వెల్లడించారు. ‘ఆసరా’ పథకం కింద రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్ అందిస్తున్నామని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అంతేకాకుండా దివ్యాంగులకు అత్యాధునిక ఉపకరణాలతోపాటు సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్టు వివరించారు. దీంతో తెలంగాణలో దివ్యాంగులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ వర్క్షాప్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.