హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ.. దశాబ్దాల చీకట్లను తొమ్మిదేండ్లలోనే చీల్చుకొని వెలుగుల వైపు పరుగులు తీసింది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలనంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపింది. ఆర్థికమంటే వాళ్లకేం తెలుసు అన్నోళ్లకే ఆర్థిక రంగంలో పాఠాలు బోధించేస్థాయికి ఎదిగింది. ఇదంతా… శతాబ్దాల చరిత్రేం కాదు.
ఈ అద్భుతమంతా కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ సాధించిన ఘనత. దేశంలోని అనేక రాష్ర్టాలకు తెలంగాణ రోల్మోడల్గా మారింది. తొమ్మిదేండ్లలోనే ఆర్థిక రంగంలో అనూహ్య అభివృద్ధి సాధించింది. సొంత పన్నుల రాబడిలో అగ్రస్థానంలో నిలిచిందని రిజర్వు బ్యాంక్ తాజా గా వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రాష్ట్రాల బడ్జెట్లను రిజర్వు బ్యాంక్ విశ్లేషించింది. రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులపై నివేదిక విడుదల చేసింది.
సొంత పన్నుల్లో అగ్రస్థానం…
తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు పన్నుల రాబడిలో 70% కంటే ఎకువ ఆదాయాన్ని సొంత పన్నులతోనే పొందుతున్నట్టు ఆర్బీఐ తన నివేదికలో విశ్లేషించింది. తెలంగాణలో సొంత పన్నుల ఆదాయం వాటా 2021-22లో 73.2%, 2022-23లో 72.8%, 2023-24లో 72.7% ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. సొంత పన్నుల రాబడిలో తెలంగాణ అగ్రపథాన నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ర్టాలు ఉన్నట్టు పేర్కొన్నది. తొమ్మిదేండ్లలో సొంత పన్నుల రాబడి మార్గాలను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పెంచుకున్నదో ఆర్బీఐ వివరించింది.
వాణిజ్య పన్నుల శాఖను స్వయంగా పర్యవేక్షించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అనేక సర్కిళ్లు ఏర్పాటు చేశారు. శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ‘నా బిల్లు-నా హకు’ నినాదంతో కొనుగోలుదారులు ప్రతి చెల్లింపునకు బిల్లు డిమాండ్ చేసే విధానం అమలు చేశారు. దీంతో సొంత పన్నుల రాబడి గణనీయంగా పెరిగింది. తెలంగాణ వాణిజ్య పన్ను ల శాఖ పనితీరును, గుజరాత్, ఉత్తరప్రదేశ్తోపాటు అనేక రాష్ర్టాలు అధ్యయనం చేశాయి. తెలంగాణకు వచ్చి ఇక్కడి విధానాలను తెలుసుకుని, ఆ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నాయి.
అప్పుల కట్టడిలోనూ తెలంగాణ ఆదర్శమే
దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే అప్పుల కట్టడిలోనూ తెలంగాణ ఆదర్శంగానే నిలుస్తున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాల కంటే తెలంగాణ చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయని ఆర్బీఐ నివేదికతో స్పష్టమైంది. జీఎస్డీపీలో అతితక్కువ అప్పులు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నది. తెలంగాణ 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 15.7 శాతం అప్పులు చేసింది. ఆ తర్వాత 2016-17లో 12.4 శాతం, 2017-18లో 21.4 శాతం, 2018-19లో 22.2 శాతం, 2019-20లో 23.7 శాతం, 2020-21లో 28.8 శాతం, 2021-22లో 27.9 శాతం, 2022-23లో 26.8 శాతం రుణాలు సేకరించింది.
బడ్జెట్ అంచనాల ప్రకారం… 2023-2024 మార్చి నాటికి అప్పులు రూ.3,89,672 కోట్లకు చేరనున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)లో అప్పులు 27.8 శాతం ఉన్నాయి. రాష్ట్రం సేకరించిన ప్రతి పైసాను పకడ్బందీ ప్రణాళికతో భవిష్యత్తు తరాల కోసం వెచ్చించింది. అంతేకాదు.. రుణాల చెల్లింపునకు కూడా ప్రణాళికాబద్ధంగానే పరిమితిని విధించుకున్నది. రాష్ట్రంలో మొత్తం అప్పుల్లో ఏడాదిలోపే చెల్లించాల్సినవి 3.6 శాతం ఉన్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం మిగిలిన రాష్ర్టాలు చేసిన అప్పులతో పోలిస్తే.. తెలంగాణ చేసిన అప్పులు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు వాటి జీఎస్డీపీతో పోలిస్తే తెలంగాణ కంటే ఎక్కువగా అప్పులు చేశాయి.