జోగులాంబ గద్వాల : ఉచితవిద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా అందజేసి ప్రతి ఒక్కరికి పని కల్పించి వలసలను నివారించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస పోయేవారని, ప్రస్తుతం ఇతర రాష్ట్ర రైతు కూలీలు తెలంగాణకు వలస వచ్చి పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతం భూములు సస్యశ్యామలంగా మారాయని అన్నారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యం పై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలోని 29 వేల పాఠశాలలు బాగు చేయాలనే విధంగా మన ఊరు, మనబడి కార్యక్రమం చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు కింద లక్ష 46 వేల ఎకరాలకు గత ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.7,400 కోట్లు ఇచ్చామని అన్నారు.
రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు వారు 92 శాతం మంది రైతులు ఉన్నారని అన్నారు. గద్వాలలో వచ్చే సంవత్సరం మెడికల్ కళాశాల వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ కేంద్రం తెలంగాణకే తలమానికమని అన్నారు. రాబోయే తరాలవారికి మంచి పాలన అందించే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
జిల్లా జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక శాసనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ ,రాష్ట్ర వినియోగదారుల ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్మన్ బి ఎస్ కేశవ్, గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు .