ఇంత భారీ ఉద్యోగ ప్రకటన దేశంలోనే మొదటిది
ఒకేసారి ఇన్ని ఉద్యోగాలను ఏ రాష్ట్రమూ ప్రకటించలేదు
గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13: నిరుద్యోగులకు అండగా 80,039 ఉద్యోగాలను ఒకేసారి ప్రకటించి, దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ అన్నారు. ఇంత భారీ ఉద్యోగ ప్రకటన దేశంలోనే మొదటిదని, ఇప్పటి వరకూ ఏ రాష్ట్రం ఇన్ని ఉద్యోగాలను ప్రకటించలేదని చెప్పారు. ఇది విద్యార్థులు, ఉద్యోగార్థులకు శుభపరిణామని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు గ్రూప్స్కు సిద్ధమవ్వాలని సూచించారు. మన ఉద్యోగాలు మన రాష్ట్ర ఉద్యోగార్థులకే దక్కేందుకు నూతన జోనల్, మల్టీ జోనల్ విధానాన్ని తేవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టిని ప్రదర్శించారని తెలిపారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణటుడే-కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ.. కరెంట్ అఫైర్స్ చదవడం ద్వారా అన్ని సబ్జెక్టుల అంశాలు ఒక దఫా పూర్తి చేయగలుగుతామని చెప్పారు. సమయ పాలన పాటిస్తూ చదవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రశ్నలు తప్పకుండా అడుగుతారని, మన ఊరు-మన బడి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు, మహిళాబంధు లాంటి అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నదని విద్యార్థులకు వివరించారు. కాగా, 21st సెంచరీ పబ్లికేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఫాకల్టీ శ్రీహరి కాకర్ల రచించిన ‘ఇండియన్ జాగ్రఫీ ఫర్ మెయిన్స్ ఇన్ కొశ్చన్ అండ్ ఆన్సర్స్’ పుస్తకాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ నవీన్చంద్ర, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంగీపురం ప్రశాంతి, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్, డైరెక్టర్ రమణారెడ్డితో కలిసి మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, ఉద్యోగార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.