హైదరాబాద్: ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మన్యూనతకు లోనవకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని దివ్యాంగులకు సీఎం పిలుపునిచ్చారు. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదనీ, తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ. 500 పెన్షన్తో సరిపడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి రూ.3016 పింఛన్ అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలతోపాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్ను అమలుచేస్తున్నామని సీఎం అన్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్తోపాటు మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు మొదలైనవి సమకూరుస్తూ రోజువారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలా అవకాశమున్న ప్రతీచోట వారి అత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సాధికారతను పెంచే దిశగా అవసరమైన అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని వెల్లడించారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని పేర్కొన్నారు. దివ్యాంగులను మనలో ఒకరుగా ఆదరిస్తూ వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.