హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో రెండో అత్యధిక సాగు భూమిగల భారత్ ఇతర దేశాల నుంచి పప్పులు, నూనెగింజలను దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమని, కేంద్రం తగిన ప్రణాళికలు రూపొందించి వీటి సాగు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించడం ప్రస్తుతం ప్రపంచం ముందున్న సవాల్ అని చెప్పారు. బుధవారం ఢిల్లీలో క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ 42వ వార్షిక సమావేశం సందర్భంగా ‘వ్యవసాయం-అనుబంధ రంగాలు’ అన్న అంశంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భిన్న పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. దేశంలోని భూ కమతాలను క్రాప్ కాలనీలుగా విభజించాలని, దీని ఆధారంగా ఏ పంటలు సాగు చేస్తే బాగుంటుందో సూచించడంతోపాటు తగిన రాయితీలు కల్పించాలని చెప్పారు. తెలంగాణ మాదిరి వ్యవసాయ రంగ, రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలని సూచించారు. పంటల ఉత్పత్తిలో ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. బుధవారం వరకు 1.36 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అత్యధికంగా వరి 64.54 లక్షల ఎకరాలు, పత్తి 50 లక్షలు, మొక్కజొన్న 6.21 లక్షలు, కంది 5.62 లక్షలు, సోయాబీన్ 4.33 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్ర చరిత్రలో వానకాలం సాగు 1.35 కోట్ల ఎకరాలు అత్యధికం కాగా, ఈ సీజన్లో దాన్ని మించి 1.36 కోట్ల ఎకరాల్లో సాగు కావడం విశేషం. వరి సాగు ఇప్పటివరకు 62 లక్షల ఎకరాలు అత్యధికం కాగా, ఈ సారి 64.54 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. దీంతో వానకాలం సాగు దాదాపు ముగిసినట్టే.