హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ):కాంట్రాక్ట్ ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపకుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించినట్టు గుర్తుచేశారు. ఇందులో సచివాలయం ప్రారంభోత్సవం రోజు 5,544 ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్టు తెలిపారు. సమావేశంలో అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.