హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఊరు – మన బడి, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నందుపల్లి గ్రామంలో సీసీ రోడ్డును, పడమటి తండా గ్రామంలో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారన్నారు. వర్షాలు తగ్గినందున పాడైన రోడ్లను బాగు చేయాలని ఆదేశించారన్నారు.
అందులో భాగంగా నాగారం నుంచి నందుపల్లి వరకు రూ.30 లక్షలు, నందుపల్లి నుంచి తండా వరకు రూ.28.లక్షలతో, పడమటి తాండాలో రూ.34 లక్షలు రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయన్నారు. పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద 12 అంశాల్లో మొదటి విడుతలో రూ.3500కోట్లతో 9వేల పాఠశాలల్లో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలల్లో మొదటి విడుతలో రూ.200కోట్లు వెచ్చించి పనులు చేపడుతున్నామన్నారు. మహేశ్వరం మండలంలో 19 పాఠశాలలు ఈ పథకం కింద రూ.5.19 కోట్లు వెచ్చించి పనులు చేపడుతున్నట్లు వివరించారు.