వనపర్తి, డిసెంబర్ 18 : రాష్ట్రంలో సాగునీటి రాకతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అదనంగా కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతన పాలకమండలి బాధ్యతలు స్వీకరించగా.. మంత్రి హాజరై చైర్మన్ రమేశ్గౌడ్, వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, డైరెక్టర్లను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి వేరుశనగ మార్కెట్ దేశంలోనే పెద్దదిగా గుర్తింపు పొందిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడి బుడ్డలకు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు.
సాగునీటి రాకతో ఏటా లక్ష ఎకరాల్లో వేరుశనగ సాగవుతున్నదని ఆయన పేర్కొన్నారు. వనపర్తి మార్కెట్ రాష్ర్టానికి ఆదర్శంగా నిలువాలని సూచించారు. సంక్షేమ పథకాలతో వ్యవసాయంపై రైతుకు భరోసా ఏర్పడిందని అన్నారు. వ్యవసాయ రంగానికి వెన్నంటే నిలిచింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అదుపు చేయడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. దేశంలో రైతు అనుకూల ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు.