హైదరాబాద్ : మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ఆదర్శంగా ఉందని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత (Nobel Awardee) సత్యార్థి కైలాష్ (Satyarthi Kailash)పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారులనుద్దేశించి సత్యార్థి కైలాష్ ప్రసంగించారు. విధుల పట్ల నిబద్దత, అంకితభావం పోలీస్ అధికారుల్లో ఎలాఉంటుందో ఒక పోలీస్ అధికారి తనయుడిగా తనకు తెలుసునని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి మహిళలు, పిల్లలను రక్షించేందుకు జరుగుతున్న పోలీసింగ్ మొత్తం దేశానికే ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. తప్పిపోయిన పిల్లల జాడ తెలుసుకొని వారిని తల్లితండ్రుల వద్దకు చేర్చడంలో జరుగుతున్న కృషి అభినందనీయమన్నారు. పెరుగుతున్న సాంకేతికత, సమాచార విప్లవంతో పోర్న్ వీడియోలు, బూతు సాహిత్యం విపరీతంగా యూట్యూబ్ లలో అందుబాటులో ఉండడంతో పిల్లలు లైంగిక వేదింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రతీ బాధిత బాలలను తమపిల్లలుగా భావించి పకడ్బందీగా దర్యాప్తు చేసినప్పుడే నిందితులకు శిక్షపడి నేరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పిల్లల అక్రమ రవాణా అనేది వ్యవస్తీకృతమైన, అత్యంత బలమైన మూలాలున్న నేరంగా ఉందని అన్నారు. ఈ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ చేపట్టి అమలు చేస్తున్న విధానాల వల్ల గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని కొనియాడారు. నోబెల్ అవార్డు చరిత్రలో ఒక పోలీస్ అధికారి సంతతికి నోబెల్ శాంతి బహుమతి లభించింది ప్రపంచంలోనే తన ఒక్కడికేనని , దీనికి పోలీస్ అధికారి కొడుకుగా గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత : డీజీపీ
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ డీజీపీ కార్యాలయానికి ఒక నోబెల్ అవార్డు గ్రహీత రావడం ఇదే మొదటి సారని అన్నారు. తెలంగాణా ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు నోబెల్ బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ లు షికా గోయల్. మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు విక్రమ్ జిత్ సింగ్ మాన్, షానవాజ్ కాసీం లతో పాటు రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.