హైదరాబాద్ : కరోనా, పోలియో వ్యాక్సినేషన్లో అగ్రభాగాన తెలంగాణ ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం.
ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ రోజు ఐదేండ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ సెంటర్లలో పోలియో చుక్కలు వేస్తారు. రేపు, ఎల్లుండి సిబ్బంది ఇంటింటికీ తిరిగి, టీకాలు వేసుకోకపోతే గుర్తించి అక్కడే టీకాలు వేస్తారన్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది కావున ఇక్కడ నాలుగో రోజు కూడా సర్వే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
జీవితాలను నాశనం చేసే పోలియో మహమ్మారి నుంచి మన పిల్లలను కాపాడుకోవాలంటే పోలియో చుక్కలు వేయడం ఒక్కటే మార్గం. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లలు శాశ్వతంగా వికలాంగులుగా మారిపోతారని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల డోసులను పంపిణీ చేశాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23,331 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశాం. వీటితోపాటు 869 మొబైల్ టీమ్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు వంటి ప్రయాణ ప్రాంగణాల్లో 869 బృందాలు టీకాలు వేస్తారని ఆయన స్పష్టం చేశారు. పల్స్ పోలియోలో 2,337 మంది సూపర్ వైజర్లు, 8,589 మంది ఏఎన్ఎంలు, 27,040 మంది ఆశా కార్యకర్తలు, 35,353 మంది అంగన్వాడీ టీచర్లు పాలుపంచుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు వివరాలను వెల్లడించారు.
వీరితోపాటు మహిళా సంఘాల సభ్యులు, మెప్మా, సెర్ఫ్ సిబ్బంది, నర్సింగ్ స్టూడెంట్స్, టీచర్లు భాగస్వాములు అవుతున్నారు. వారందరికీ వైద్యారోగ్య శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వ్యాక్సినేషన్ లో తెలంగాణ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. నీతి ఆయోగ్ సైతం ఇదే చెప్పిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో కొవిడ్ టీకాల పంపిణీ చేపట్టామన్నారు.
బస్తీలోని పేదల సుస్తి ని పొగొట్టేందుకే హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు సీఎం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 256 బస్తీ దవాఖానాలు నగరంలో సేవలు అందిస్తున్నాయి. మరో 94 బస్తీ దవాఖానాలు ఈ ఏడాదిలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, హైదరాబాద్ కలెక్టర్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.