హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ఆయిల్పామ్ సాగులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పామ్ ఆయిల్ రికవరీలో, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మంచి పేరు తెచ్చుకొన్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగును విస్తరించామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ నూనె ఉత్పత్తిదారుల సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎన్డీడీబీ చైర్మన్ మనీశ్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆయిల్పామ్ సాగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని కోరారు. విదేశాల నుంచి విత్తనాలను సేకరించడం రైతులకు సమస్యగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఆయిల్పామ్ విత్తనాభివృద్ధి సంస్థ(సీడ్ గార్డెన్)ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సదస్సులో ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తదితర రాష్ర్టాల ఆయిల్ఫెడ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.