హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం, చార్జీలు తక్కువగా ఉండటం గొప్ప విషయమని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ విజన్, విద్యుత్తు ఇంజినీర్ల కృషితోనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. దక్షిణాది రాష్ర్టాల విద్యు త్తు సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థ, నూతన సబ్స్టేషన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై అధ్యయ నం చేసింది. ఈ బృందం శుక్రవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో టీఎస్ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో సమావేశమైంది.
ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నదని, తెలంగాణ విద్యుత్తు వ్యవస్థలు అన్ని అంశాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. తక్కువ కాలంలో విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎండీ ప్రభాకర్రావును అభినందించారు. హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పవర్ రింగ్మెన్ వ్యవస్థ అద్భుతమని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం మంచి పరిణామమని చెప్పారు.
రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా చాలా నేర్చుకోవాల్సి ఉన్నదని, రాయదుర్గం వంటి సబ్స్టేషన్లు నగరాల్లో చాలా అవసరమని, 15,467 మెగావాట్ల పీక్ డిమాండ్ను అధిగమించడం గొప్ప విషయమని కొనియాడారు. తలసరి విద్యుత్తు వినియోగం, తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటే, ఇప్పుడు 15,467 మెగావాట్ల డిమాండ్ను సునాయాసంగా అధిగమించామని చెప్పారు. విద్యుత్తు వ్యవస్థల బలోపేతానికి రూ.39 వేల కోట్లకుపైగా ఖర్చుచేశామని, వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరాతో దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు.