హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం. ఇలాంటి సమగ్రమైన, సమ్మిళిత అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు’.. ఇటీవల ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వేను పరిశీలిస్తే మంత్రి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని నిరూపితం అవుతున్నది. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవారంగాల్లో ఏదో ఒకటి గణనీయ వృద్ధిని సాధిస్తుంది. కానీ, తెలంగాణలో మొదటి నుంచీ మూడు రంగాలు.. మూడు చోదకశక్తులుగా పనిచేస్తున్నాయి. ప్రగతిరథాన్ని పరుగులు పెట్టించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ ఆర్థిక రంగం ‘త్రి’శక్తితో మూడురెట్ల వేగంతో పరుగులు పెట్టింది.
సర్వే ప్రకారం 2022-23లో రాష్ట్ర జీఎస్డీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.13.27 లక్షల కోట్లుగా నమోదైంది. 2020-21తో పోల్చితే ఏకంగా 15.6% వృద్ధిని సాధించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు 15.4% కంటే మెరుగైన వృద్ధిరేటును సాధించింది. 2014-15 నుంచి గమనించినా.. తెలంగాణ వృద్ధిరేటు ప్రతిసారీ దేశ జీడీపీ వృద్ధిరేటును మించి నమోదవుతున్నది.
జీఎస్డీపీ పెరుగుదలలో ప్రాథమిక, ద్వితీయ, సేవా రంగాలు మూడూ కీలక భూమిక పోషించాయి.
వ్యవసాయ రంగం: 2021-22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ‘స్థూల విలువ జోడింపు’ (జీవీఏ)తో పోల్చితే.. 2022-23లో 11.9% వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర జనాభాలో ఏకంగా 45.8% మందికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పించింది. పారిశ్రామిక రంగం: 2022-23లో పారిశ్రామిక రంగం జోడించిన జీవీఏ వృద్ధిరేటు 10.5% నమోదైంది. వరుసగా రెండోసారి రెండంకెల వృద్ధి నమోదైంది. 2020-21లో కొవిడ్ ఉత్పాతం కుదిపేసిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగం 2021-22లో ఏకంగా 17.9% వృద్ధిరేటు నమోదు చేయడం విశేషం. సేవారంగం: 2022-23లో సేవారంగం జీవీఏ ఏకంగా 17.5 శాతంగా నమోదైంది.ఇలా మూడు రంగాలు ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతూ రెండంకెల వృద్ధిరేటుతో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చక్రాలుగా మారాయి.