హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బోధన దవాఖానల్లో సేవలు అందించేందుకు 34 స్పెషాలిటీ విభాగాల్లో ఒకేసారి 1,061 మందికి పోస్టింగ్లు ఇచ్చామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాక దేశ వైద్య విద్యలోనే రికార్డు అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ వల్లే వైద్యరంగంలో ఈ నూతన విప్లవం సాధ్యమైందని వివరించారు. సోమవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులుగా చేరుతున్న మీ అందరికీ స్వాగతం. ప్రజల ప్రాణాలను కాపాడేలా మిమ్మల్ని తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు’ అని అన్నారు. ప్రజావైద్యాన్ని పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని, పెద్ద ఎత్తున దవాఖానలు నిర్మిస్తున్నారని, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నారని చెప్పారు. మరోవైపు అన్ని స్థాయిల దవాఖానలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మందులు, పరికరాలు లేవనే పరిస్థితి లేకుండా అన్నీ ఆన్లైన్తో అనుసంధానించామని, వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వైద్య శాఖకు రూ.12,364 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వివరించారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి వైద్యం కోసం చేస్తున్న ఖర్చు రూ.3,532 అని, ఈ అంశంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు.
తొమ్మిదేండ్లలో 31 వేల ‘వైద్య’ నియామకాలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను కేవలం 5 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, రిక్రూట్మెంట్ బోర్డును అభినందించారు. గత నెలలో శిల్పకళావేదికపైనే 969 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అందజేశామని గుర్తు చేశారు. 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలో ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు. వైద్య శాఖలోని ఏడు విభాగాలకు చెందిన 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్టు తెలిపారు. ఇలా తొమ్మిదేండ్లలో 22,263 పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. మరో 9,222 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, మొత్తంగా ఒక్క వైద్యారోగ్య శాఖలోనే 31,484 పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు.
ఓపికగా సేవలు అందించండి
దేశాన్ని కాపాడే సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు ఎంతో గొప్పవారని మంత్రి హరీశ్ కొనియాడారు. ఈ వృత్తికి మరింత గౌరవాన్ని పెంచాలని వైద్యులకు సూచించారు. ‘మెడిసిన్స్ క్యూర్ డిసీజెస్, బట్.. ఓన్లీ డాక్టర్స్ కెన్ క్యూర్ పేషెంట్స్.. ఔషధాలు వ్యాధిని తగ్గించగలవు, కానీ డాక్టర్లు మత్రమే రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయగలరు. ఎన్ని మందులు ఇచ్చామనే దానికంటే, మీరు ప్రేమగా మాట్లాడే మాట, ఇచ్చే ధైర్యం సగం రోగాన్ని తగ్గిస్తాయి’ అని గుర్తు చేశారు.
కార్పొరేట్తో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లో పని భారం ఎక్కువగా ఉంటుందని, ఓపిక తెచ్చుకొని వైద్యం చేయాలని కోరారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఒక్కో వైద్య విద్యార్థిపై ప్రభుత్వం రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. పెద్ద దవాఖానలపై భారం తగ్గించేందుకు 350కిపైగా బస్తీ దవాఖానలు, 3 వేలకు పైగా పల్లె దవాఖానలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పరిశోధనలు చేయాలనుకొనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వర్సిటీ నుంచి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో 50 వేల పడకలు
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ వరంగల్లో రెండు వేల పడకలతో హెల్త్ సిటీని, హైదరాబాద్ నలువైపులా వెయ్యి పడకల చొప్పున టిమ్స్ దవాఖానలను నిర్మిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. వీటితోపాటు నిమ్స్ విస్తరణతో రెండు వేల పడకలు, ఎంఎన్జే దవాఖానలో 300 నుంచి 750 పడకలు, 200 పడకలతో గాంధీ, నిమ్స్లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్లు.. ఇలా మొత్తంగా 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకలు కొత్తగా అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 17,150 పడకలు ఉండేవని ఇప్పుడు ఆ సంఖ్య 33,314కు పెంచుతున్నామని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల హాస్పిటళ్లు, కొత్తగా నిర్మిస్తున్న దవాఖానలు అన్నీ అందుబాటులోకి వస్తే 50 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వరంగల్ హెల్త్ సిటీని ఈ ఏడాది ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం
మాయ చేస్తేనో.. మంత్రం వేస్తేనో కాలేదు
గత ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేశాయని, దాంతో విద్యార్థులు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రి అన్నారు. 60 ఏండ్ల ఉమ్మడి పాలనలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలోనే తెలంగాణ సర్కారు 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని చెప్పారు. 2014లో 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు 8,340కి చేరాయని వివరించారు. ఇదేదో మంత్రం వేస్తేనో.. మాయ చేస్తేనో కాలేదని, సీఎం కేసీఆర్ పట్టుదల, చిత్తశుద్ధి వల్లే సాధ్యమైందని వెల్లడించారు. ప్రధాని మోదీ ఇటీవల వచ్చి నాలుగేండ్ల కింద ప్రారంభమైన ఎయిమ్స్కు మళ్లీ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల వివరాలపై స్పందిస్తూ..