Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ అడ్డాగా మారింది. ఆయా రాష్ర్టాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నది. రెండ్రోజుల క్యాంపును పూర్తి చేసుకొన్న జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయమే తిరిగి వెళ్లిపోయారు. వాళ్లు అలా వెళ్లారో లేదో రాత్రికి బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో దిగిపోయారు.
బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి గుడ్బై చెప్పిన జేడీయూ అధినేత నితీశ్కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ నెల 12న నితీశ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. జార్ఖండ్లోనూ రాజకీయ సంక్షోభం తలెత్తడంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ రెండ్రోజులుగా నగరంలోని లియోనియో రిసార్ట్లో ఉంచింది. మంగళవారం జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వ బలపరీక్ష ఉండడంతో ఎమ్మెల్యేలను ఆ పార్టీ ప్రత్యేక విమానంలో ఆదివారం రాంచీకి తరలించింది.
హైదరాబాద్కే ఎందుకు?
ఆయా రాష్ర్టాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తుతుండడంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటమే కారణం. జార్ఖండ్ ఎమ్మెల్యేలను కాపాడేందుకు పార్టీ నుంచి మల్రెడ్డి రాంరెడ్డి, సంపత్కుమార్, ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో క్యాంపు ఎమ్మెల్యేలపై నిఘా పెడుతున్నది. కాంగ్రెస్ హైదరాబాద్ను క్యాంప్లకు కేరాఫ్గా మార్చిందనే విమర్శలు వస్తున్నాయి.