హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షే మ పథకాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో ప్రజల్లో ధీమా వచ్చిందని పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో రాష్ట్రం పురోగమిస్తున్నదని, ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం డైమండ్ ఆఫ్ ఇండియాగా తయారవుతుందని అన్నారు. జగిత్యాలలో జిల్లా నూత న కలెక్టరేట్ను బుధవారం ప్రారంభించిన అనంతరం అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ధనిక రాష్ట్రం అవుతుంది, భారతదేశంలోనే అత్యధిక జీతభత్యాలు తీసుకొనే ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు ఉంటారని ఉద్యమ సమయంలో తాను చెప్పినట్టే నేడు 100 శాతం నిజమైందని పేర్కొన్నారు.
‘న్యాయేనా మార్గేనా మహీం.. మహీషాం… లోకాసమస్తా సుఖినోభవంతు అన్నట్టుగా పరిపాలించేవారు.. రాజ్యకార్యాన్ని నిర్వహించేవారు.. న్యాయమార్గంలో ఈ భూమిని పరిపాలించాలి. ఆదరించాలి. జనులందరూ సుఖంగా ఉండాలి అన్న సూత్రాన్ని నమ్మి ఆచరిస్తున్నాం’
– సీఎం కేసీఆర్
మల్టీఫోల్డ్ వృద్ధి దిశగా..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్కో పథకం వెనుక ఎంతో తపన, ఆలోచన, దూరదృష్టి ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే మంచినీరు, సాగునీరు, విద్యుత్తు, సంక్షేమ రంగం, విద్య, వైద్యం, కొత్త మెడికల్ కాలేజీలు వంటివి సాధ్యమయ్యాయని చెప్పారు. ఎనిమిదేండ్ల క్రితం వీటి ఊసేలేదని, అడవులు నరకడం తప్ప చెట్లు నాటడంలేదని, నేడు అద్భుత వనీకరణ జరిగి చైనా, బ్రెజిల్ తరువాత మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరిత తెలంగాణ సాకారం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు సాకారం చేసింది ఉద్యోగులేనని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ‘ఆర్థిక వృద్ధి అనేది చాలామందికి అర్థంకాదు. వృద్ధి ఒక దశవరకు స్తబ్ధుగా ఉంటుంది. ఆ దశ దాటిన తరువాత మల్టీఫోల్డ్గా ఉంటుంది. ఆ గ్రోత్ను అందుకొనే దశకు తెలంగాణ చేరుకొంటున్నది. ఇంకొంచెం ఉత్సాహంతో ముందడుగు వేస్తే తెలంగాణ అద్భుతమైన డైమండ్ ఆఫ్ ఇండియాగా తయారయ్యే సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
కలెక్టరేట్లు ఆవిష్కరణ కేంద్రాలు
చుట్టూ ఉన్న పరిస్థితులను పరికిస్తూ, అవసరాలను గుర్తిస్తూ, సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఏ సమాజమైతే ముందుకు పురోగమిస్తదో ఆ సమాజం చాలా అద్భుత ఆవిష్కరణలు చేయగలదని సీఎం అన్నారు. అలాంటి పనులు చేయడానికి కొత్త కలెక్టరేట్ భవనాలు దోహదపడతాయని తెలిపారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ
గురుకుల విద్యలో దేశానికి తెలంగాణ రాష్ట్రం తలమానికంగా ఎదిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. గురుకులాల ఏర్పాటులో దేశంలో తెలంగాణకు పోటి, సాటి ఎవరూ లేరని పేర్కొన్నారు. ఇప్పటికే వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటు చేసుకొని అద్భుత ఫలితాలు సాధించే స్థాయికి ఎదగడం గర్వకారణమని అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ఎవరూ ఊహించని.. ఎవరూ కలగనని రీతిలో 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకొంటున్నాం. జగిత్యాల మెడికల్ కాలేజీని రూ.108 కోట్లతో నిర్మించుకొంటున్నాం’ అని సీఎం చెప్పారు.
ప్రజల్లో ధీమా..
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాల వల్ల ప్రజల్లో ధీమా వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ దేశంలోనూ లేనివిధంగా ఏడువేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల ధాన్యాన్ని వాళ్ల ఊర్లలోనే కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ‘ధాన్యం కొనుగోలు వెనుక ఒక పరమార్థం ఉన్నది. చెల్లాచెదురైన తెలంగాణ రైతాంగం ఒకచోటకి చేర్చి వ్యవసాయంలో అద్భుత ప్రగతి సాధించాలన్నదే ఆ పరమార్థం. నేడు తెలంగాణ రైతాంగం మూడు కోట్ల టన్నుల పైచిలుకు వరి ధాన్యాన్ని పండిస్తున్నది. రాష్ట్రం నుంచి కూరగాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తాం. రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు కూడా పెడుతున్నాం. ఇప్పుడు వ్యవసాయంలో ధీమా వచ్చింది’ అని సీఎం అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం భగీరథ సాకారం
అనేక రంగాల్లో లోతైన మేధో మథనంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధి సాధిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే తప్ప పనులు జరుగవని తెలిపారు. ‘ఐదేండ్లలో మిషన్ భగీరథ పథకం పూర్తిచేసి నల్లా నీళ్లు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని నేను అసెంబ్లీలో చెప్పిన. చెప్పినట్టుగానే 2 లక్షల కిలోమీటర్ల మేర పరిచిన పైప్లైన్లతో నీళ్లు ఇస్తున్నం. ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యక్రమం. అటవీశాఖ, రైల్వేలైన్లు, రోడ్లు.. అన్నీ దాటుకొంటూ 7,600 పైచిలుకు క్లియరెన్సులు పొందిన తరువాత ఈ పథకం సాధ్యమైంది. ఏముందయ్యా మిషన్ భగీరథ అని తేలిగ్గా అనేవాళ్లు ఉంటారు. కానీ, దాని వెనుక ఎంతో మథనం, కష్టం ఉన్నాయి. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంద్రసేనారెడ్డి అనే పంచాయతీరాజ్ ఇంజినీర్ ఉండేవారు. ఆయన ఇచ్చిన సలహామేరకు అక్కడ ఈ పథకాన్ని అమలుచేసిన. అదే పథకాన్ని నేడు తెలంగాణ వ్యాప్తంగా అమలుచేశాం’ అని వెల్లడించారు.
27 వేల ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం
గతంలో 17 వేల ఓవర్హెడ్ ట్యాంకులు ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మరో 27 వేల కొత్త ట్యాంకులు నిర్మించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్నీ కలిపి నేడు రాష్ట్రంలో దాదాపు 40 వేల ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయని చెప్పారు. ‘19 ఇన్టెక్వెల్స్ నుంచి నీరు తీసుకొని, 150 కేంద్రాల్లో శుద్ధిచేసి, 40వేల ఓవర్హెడ్ ట్యాంకులకు పంప్ చేస్తున్నాం. అక్క డి నుంచి గ్రావిటీతో ఊళ్లలో ట్యాంకులకు సరఫరా చేస్తున్నాం. ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నా యో ఆయా సర్పంచులకు కూడా తెలియదు’ అన్నారు.
రూ.62 వేల కోట్ల నుంచి రూ.2.20 లక్షల కోట్ల బడ్జెట్ దాకా..
2014లో తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ.62 వేల కోట్లు అని, అది ఈ సంవత్సరం రూ.2.20 లక్షల కోట్లు దాటిపోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణకంటే 60 ఏండ్లు ముందు ఏర్పడిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలన్నింటినీ తలదన్ని జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్ 1గా ఎదిగామని పేర్కొన్నారు. ‘ఈ ప్రగతి నా ఒక్కడి వల్లనో.. సీఎస్ వల్లనో పిడికెడు మంది మంత్రుల వల్లనో.. ఎమ్మెల్యేల వల్లనో సాధ్యమయ్యేది కాదు. అందరం కలిస్తేనే సాధ్యమైంది. కరువులతో, వలసలతో, దాహంతో, కరెంట్ కోతలతో, వేదనలతో, రోదనలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటమే కాకుండా, అనతికాలంలో ఉన్నత స్థానంలోకి చేరుకొన్నాం’ అని వెల్లడించారు.
జిల్లాల ఏర్పాటు ఆశామాషీ నిర్ణయం కాదు
పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకొన్నామని, వాటిల్లో జగిత్యాలతో కలిపి 14 కలెక్టరేట్లు ప్రారంభించుకొన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. 12 కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో మూడునాలుగు నిర్మాణదశలో ఉన్నాయని చెప్పారు. ‘33 జిల్లాల ఏర్పాటు తమాషా నిర్ణయం కాదు. మంథని ఒక రెవెన్యూ డివిజన్. ములుగు, భూపాలపల్లి ఒక్కో నియోజకర్గాలే. కానీ జిల్లాలుగా ఏర్పాటు చేసుకొన్నాం. దీనికి అర్థం.. పరమార్ధం ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో మాజీ చీఫ్ సెక్రటరీని సలహాదారుగా పెట్టుకొని అక్కడ జిల్లాల విభజన చేశారు. బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే భౌగోళికంగా పెద్దగా ఉండేది. అట్లాంటి దాన్ని ఆరేడు జిల్లాలుగా చేశారు. మన భూపాలపల్లి, ములుగు లాగనే అక్కడ అడవి ఎక్కువ. నేను వారికి ఫోన్చేసి ఒకే నియోజకవర్గం.. కానీ విస్తృతి బాగా ఉన్నది ఏం చేయాలి? అని అడిగితే సర్.. వెంటనే చేసేయండి అని వారు చెప్పారు’ అని సీఎం గుర్తుచేశారు. విస్తృతి పెద్దగా ఉండటం, రాష్ర్టాల సరిహద్దు కావడం, గోదావరి, ప్రాణహిత నదుల సంగమం.. విచిత్ర పరిస్థితి వంటి నేపథ్యంలో జిల్లాగా ఏర్పాటు చేశామన్నారు.
ఆసరాపై మథనం అంతా ఇంతా కాదు
అధికారులు ఏమి చేసినా ఫలవంతంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆసరా పథకం వెనుక సాగించిన మథనాన్ని ఆయన వివరించారు. ‘2014లో కడియం శ్రీహరి నేతృత్వంలో మ్యానిఫెస్టోను రూపొందించే సమయంలో ఆసరాపై చర్చించాం. వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఎంత ఇవ్వాలె? పెన్షన్ ఎందుకు ఇస్తాం? పెన్షన్ ఇవ్వటానికి అర్థం పరమార్థం ఉన్నదా? అని అడిగితే సాయం కోసం ఇస్తమన్నరు.. పాలిటిక్స్ కోసం అన్నరు. కానీ నేనే లీడ్ తీసుకొని ఇప్పుడు అయితే రూ.1,000 ఇస్తాం. తరువాత పెంచుకొంటామని చెప్పిన. ఆ తర్వాత పరిస్థితి బాగైంది. రూ.2016కు పెంచుకొన్నాం. ఇటీవల టీవీల్లో చూసిన.. చాలా మంది వృద్ధులు ఆసరా పెన్షన్లు లేకపోతే చెర్లల్ల, బావుల్ల పడి సచ్చిపోదుము అని చెప్పారు. మాకు రేషన్ కార్డు ఉన్నా రూ.2,000 పింఛన్ వస్తున్నది బిడ్డా సంతోషంగా ఉన్నం అని చెప్తున్నరు. పాలించేవారికి, ముఖ్యమంత్రికి.. మంత్రికి.. ఎమ్మెల్యేలకు ఇంతకుమించిన తృప్తి ఏం ఉంటది?’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఆసరా పథకం దోహదం చేసిందని ఆర్థికవేత్తల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని సీఎం తెలిపారు. ‘కేసీఆర్ గ్రామీణ నేపథ్యం నుంచి రావడం వల్ల కొన్ని లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తున్నారు’ అని ఒక ఆర్థికవేత్త ఉదహరించిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ తెలివికి తార్కాణాలు
ఈ కలెక్టరేట్ భవనాలను తెలంగాణ ముద్దుబిడ్డ, హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి రూపకల్పన చేశారని సీఎం తెలిపారు. ఉషారెడ్డిని సభకు పరిచయం చేశారు. ‘తెలంగాణవారికి తెలివిలేదని చాలామంది అన్నారు. తెలంగాణ తెలివికి, నైపుణ్యానికి, కౌశలానికి ప్రతీక ఈ కలెక్టరేట్ భవనాలు. తెలంగాణ తెలివిని, ప్రతిభను చూపెట్టే అవకాశం లభించింది. రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే ఉత్సాహంతో సమాజాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ఇంకా సంస్కరణలు జరుగుతున్నాయి. ఇవి నిరంతరం కొనసాగుతాయి. అన్నింటినీ కలబోసుకొని టీమ్వర్క్తో ముందుకు సాగాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ సమీకృత భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, ఎల్ రమణ, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, రవిశంకర్, విద్యాసాగర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి తదితరులు