హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్)పై వరుసగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆ అధికారిపై ప్రభుత్వం చర్యలకు వెనుకాడటం అనుమానాలకు తావిస్తున్నది. సాధారణ బదిలీల్లో సీనియార్టీ పాటించలేదని, ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు విజిలెన్స్ సైతం నాడు ప్రభుత్వానికి నివేదిక అందించింది. అప్పుడు డీహెచ్ సహా ఆరుగురు ఉద్యోగులకు చార్జ్మెమోలు జారీ చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఏవో ఉద్యోగోన్నతుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు కొంతమంది ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వరంగల్, హైదరాబాద్ జోన్ల పరిధిలో రూ.50లక్షల వరకు వసూలు చేసినట్టు లేఖలో ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం డీహెచ్, టీవీవీపీ కమిషనర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులను క్రియేట్ చేస్తూ 2024 ఆగస్టు 9న జీవో నెంబర్ 92 జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న డీహెచ్ను ఇన్చార్జి హోదాలో నియమించింది.కీలక బాధ్యతలో ఉన్న ఆ అధికారి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. సదరు అధికారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కేంద్రంలో ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్గా కొనసాగుతుండటం.. ఆరోపణలు వచ్చినా ప్రతిసారి లాబీయింగ్ చేసి విభాగాధిపతిని కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి.
డీపీసీ సమావేశం నిర్వహించి ఆ అధికారిని మార్చాలని మంత్రి ఆదేశించినా.. హెల్త్ సెక్రటరీపై ఆ బ్యూరోక్రాట్ ఒత్తిళ్ల కారణంగా ఫైల్ను ముందుకు జరుపడం లేదనే ఆరోపణలున్నాయి. కేంద్రంలో కీలక పదవిలో ఉన్న బ్యూరోక్రాట్ అండతోనే సదరు విభాగాధిపతి అడ్డూఅదుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.