హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్త్రన్ మంగళవారం గుండెపోటులో హఠాన్మరణం చెందారు. ఉదయం వేళ గుండెపోటు రావడంతో ఆయన కుమారుడు హరిరతన్ వెంటనే ఏఐజీ దవాఖానకు తరలించారు. అక్కడ మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ రాజీవ్త్రన్ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తమ సహచర ఐపీఎస్ అధికారి విధి నిర్వహణలో ఆకస్మికంగా మరణించడంతో పలువురు ఐపీఎస్ అధికారులు దవాఖానకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
సమర్థుడిగా, మృదుస్వభావిగా, క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్గా రాజీవ్త్రన్కు డిపార్ట్మెంట్లో పేరున్నది. మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న తరుణంలో హఠాన్మరణం చెందడం తమను తీవ్రంగా కలిచివేస్తున్నదని ఐపీఎస్ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ బీ శివధర్రెడ్డి, రైల్వేలు రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ ఎం భగవత్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, పోలీస్ కమిషనర్లు అవినాష్ మొహంతి, తరుణ్జోషి, ఇతర అడిషనల్ డీజీలు, ఐపీఎస్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధికారులు రాజీవ్త్రన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ముక్కుసూటి మనిషిగా పేరు..
ముక్కుసూటి మనిషిగా రాజీవ్త్రన్కు డిపార్ట్మెంట్లో మంచి పేరున్నది. చండీఘఢ్కు చెందిన ఆయన 1964 అక్టోబర్ 2న జన్మించారు. డెహ్రాడూన్లోని రాష్ట్రీయ మిలటరీ కాలేజీలో చదువుకున్నారు. ఐపీఎస్ కాకముందు కొంతకాలం మిలటరీలో పనిచేశారు. ఆ తర్వాత 1991 ఐపీఎస్గా ఎంపికై.. తొలిసారిగా కామారెడ్డి ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. విశాఖపట్నం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేశారు.
ఆ తర్వాత విశాఖపట్నం ఎస్పీగా, ఐటీబీపీ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీగా, హైదరాబాద్ రీజన్ ఐజీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగా, ఆర్గనైజేషన్స్ ఏడీజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా, ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 33 ఏండ్లపాటు ఆయన ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో కొనసాగుతున్నారు. రాజీవ్త్రన్ భౌతికకాయానికి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ షేక్పేట్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పలువురు ప్రముఖుల సంతాపం
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్త్రన్ మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘకాలంపాటు పోలీసు విభాగానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. నిజాయితీతో సమర్థంగా విధులు నిర్వర్తించిన అధికారులను తెలంగాణ సమా జం ఎన్నటికీ మర్చిపోదని తెలిపారు. రాజీవ్త్రన్ కుటుంబసభ్యులకు రేవంత్రెడ్డి ప్రగాఢసానుభూతి తెలిపారు. రాజీవ్ రతన్ హఠాన్మరణం పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. రాజీవ్త్రన్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజీవ్త్రన్ మృతి పట్ల పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఐపీఎస్లు సంతాపం ప్రకటించారు.