హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని, దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి ‘తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022’కు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది.
అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణతోపాటు ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధనకు ఈ విశ్వవిద్యాలయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. సంప్రదాయక అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలుగా పరిశోధనలు చేయడం కూడా దీని బాధ్యతల్లో ఒకటిగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరితహారం, ప్రకృతివనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, నర్సరీలు, హరితనిధి కార్యక్రమాలను చేపట్టింది.
హరితహారాన్ని నిరంతరంగా కొనసాగించాలన్న లక్ష్యసాధనకు అటవీ వృత్తి నిపుణుల లభ్యత తగినంతగా ఉంటుందని తెలిపింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్ర్తాల్లో నూతన కోర్సులతో పాటు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు. అటవీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చాన్స్లర్గా వ్యవహరించనున్నారు. ఈ వర్సిటీకి తొలి వీసీని చాన్స్లర్ నియమిస్తారు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై తొలుత మంగళవారం అసెంబ్లీలో, ఆ తర్వాత శాసనమండలిలో చర్చిస్తారు.