కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరిన శిశిర్ అధికారి.. ఆదివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. పూర్బా మేదినీపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో షాతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. ఒకప్పుడు మమతకు సన్నిహితుడిగా ఉండి ఇప్పుడు నందిగ్రామ్లో ఆమెపైనే పోటీ చేస్తున్న సువేందు అధికారి తండ్రే ఈ శిశిర్ అధికారి. అధికారి కుటుంబానికి మేదినీపూర్, బాంకురా, పురూలియాల్లోని 30 నియోజకవర్గాలపై పట్టు ఉంది. 23 ఏళ్ల పాటు టీఎంసీతో ఉన్న శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ప్రతిష్టాత్మక దిఘా-శంకర్పూర్ డెవలప్మెంట్ కౌన్సిల్, తృణమూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఈ ఏడాది మొదట్లోనే తొలగించారు. టీఎంసీ నేతలే నన్ను బీజేపీలో చేరేలా చేశారు. వాళ్లు ఏం చేస్తారో చేయనివ్వండి. నేను చేసేది చేస్తాను అని శిశిర్ అధికారి అన్నారు.