హైదరాబాద్ : ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణత సాధించిన వారిలో 1,76,719 మంది విద్యార్థులు ఏ గ్రేడ్, 1,04,888 మంది విద్యార్థులు బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సాధించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఇంటర్ సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం tsbie.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించొచ్చు.
విద్యార్థుల పాస్ మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040-24600110 నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఈ నంబర్ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.