హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కేరళ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదా? పలు ఆర్థికాంశాల్లో అత్యంత రహస్యంగా వ్యవహరించేందుకు ఇక్కడి ఇంటెలిజెన్స్ పోలీసులను కేరళకు పంపిందా? అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ఇంటెలిజెన్స్ సిబ్బందిని ఎంపిక చేసి తెలంగాణ మంత్రులకు బందోబస్తు పేరిట కేరళకు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ జరిగే ఎన్నికలపై గురిపెట్టిన రాహుల్గాంధీ.. ఆ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. కేరళ వెళ్లిన ఇంటెలిజెన్స్ సిబ్బందిలో అత్యధికశాతం ఎస్ఐబీకి చెందినవారే ఉన్నట్టు సమాచారం. వారితోనే అన్ని కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు పోలీసువర్గాలు అంటున్నాయి.
తెలంగాణ నేతలు ప్రచారం చేసే చోట..
కేరళలో కాంగ్రెస్ నేతలు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో అక్కడ మన పోలీసులు ప్రత్యక్షమవుతున్నారట. మన నేతల ప్రసంగానికి ముందు, తర్వాత కూడా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్టు తెలిసింది. వీరితో పాటే సర్వే చేసే సిబ్బందిని కూడా కేరళకు పంపించారని సమాచారం. వీరు ఆయా నియోజకవర్గాల్లో రహస్యంగా సర్వేలు చేస్తున్నట్టు తెలిసింది. రాహుల్గాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రచారానికి ముందు వీరు స్థానిక ప్రజల సమస్యలు, ఇతర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని సమాచారం. వీరిలో కొందరు.. తెలంగాణలో సంక్షేమ పథకాలు కేరళంలో వైరల్గా మారేందుకు అక్కడి సోషల్ మీడియా వారియర్స్తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిసింది.
‘ఆ వ్యవహారాలన్నీ’ మనోళ్లతోనే..
ప్రస్తుతం ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆర్థికాంశాలే ఎక్కువగా ముడిపడి ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనిఖీ బృందాలతో సత్సంబంధాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంచుకున్నట్టు తెలిసింది. ఆర్థికాంశాల్లో తెలంగాణలో వాడిన విధానాన్నే కేరళలోనూ అమలు చేస్తున్నారట. ప్రజాభిప్రాయ సేకరణతోపాటు ‘ఇతర’ అంశాల్లో మనోళ్లు చాలా బిజీబిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకంగా హోటళ్లు సైతం బుక్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ ఫండ్ను చాకచక్యంగా చేరాల్సిన చోట్లకు చేర్చుతున్నారని సమాచారం. మొత్తానికి తెలంగాణలో సంఘ విద్రోహశక్తుల కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వాడాల్సిన పోలీసులను కేరళలో ఎన్నికల కోసం వాడుతూ అధికార దుర్వినియోగాని కి పాల్పడున్నారని పోలీసులే చెప్తున్నారు. అధికారిక వ్యవస్థను అడ్డగోలుగా వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.