హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఆర్థికాభివృద్ధిలో గత ఎనిమిదేండ్ల నుంచి అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణకు తిరుగులేదని చాటిచెప్తున్నది. ప్రత్యేకించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడిలో గణనీయ వృద్ధిరేటును నమోదు చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,500 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా.. రూ.12,372.73 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.15,600 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి 6 నెలల్లోనే (2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలోనే) రూ.7,212 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రాబడి కంటే 48% ఎక్కువ. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కంటే చివరి ఆరునెల్లోనే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఈ లెక్కన ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం బడ్జెట్ అంచనాలను మించిపోవడం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.
జోరుగా రిజిస్ట్రేషన్లు, దండిగా ఆదాయం
తెలంగాణలో గత ఎనిమిదేండ్ల నుంచి భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు మూడు రెట్ల వరకు అధికమయ్యాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరగడంతో భూములు, ఇండ్ల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జోరుగా జరుగుతున్నాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు దండిగా ఆదాయం వస్తున్నది. దేశంలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. గత ఎనిమిదేండ్లలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి ఏకంగా 468% పెరగటమే ఇందుకు నిదర్శనం. 2014-15లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి రూ.2,175 కోట్లు మాత్రమే. ఆ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 2021-22 నాటికి ఈ రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా 20 లక్షలకు, ఆదాయం రూ.12,372 కోట్లకు పెరగడం విశేషం.