హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నుల శాఖ పనితీరు అద్భుతంగా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొనియాడారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ పనితీరు, అదనపు వనరులను పెంచుకోవడం తదితర అంశాలపై చర్చించారు. ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న సూచనలతో ముందుకు వచ్చిన అధికారులను సీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఎగవేతదారుల నుంచి పన్ను వసూలులో అధికారులు సక్సెస్ అయ్యారని కొనియాడారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సఫలీకృతం అయ్యారని చెప్పారు. అదేస్ఫూర్తితో పని చేయాలని, 2023-24లో రూ.85 వేలకోట్ల లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అప్పిలేట్ జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్లో ఉన్న కేసులను ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షించాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్, అదనపు కమిషనర్లు సాయికిశోర్ హరిత తదితరులు పాల్గొన్నారు.