హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూలధన వ్యయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. సొంత పన్నుల రాబడిలో ఏటేటా వృద్ధిని సాధిస్తున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.29,288 కోట్లుగా ఉన్న ఈ రాబడి 2021-22లో ఏకంగా రూ.92,910 కోట్లకు చేరింది. ఇలా వచ్చిన రాబడిలో సింహ భాగాన్ని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తూ దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది.
ఎనిమిదేండ్లలో ఐదున్నర రెట్లు పెరిగిన మూలధన వ్యయం
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో ప్రజల జీవితాలు అంధకారంలో చిక్కుకుంటాయని చిలుక జోస్యం చెప్పినవారికి సీఎం కేసీఆర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దీటైన సమాధానమిచ్చారు. పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతో తెలంగాణను దేశానికే రోల్ మాడల్గా తీర్చిదిద్దారు. సొంత పన్నుల రూపంలో వస్తున్న రాబడిని సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. తద్వారా రాష్ట్ర సంపదను పెంచి తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా నిలిపారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మూలధన వ్యయాన్ని ఏటా గణనీయంగా పెంచుతున్నారు. ఫలితంగా 2014-15వ ఆర్థిక సంవత్సరంలో రూ.11,583 కోట్లుగా ఉన్న రాష్ట్ర మూలధన వ్యయం 2021-22లో రూ.61,343 కోట్లకు చేరింది. అంటే, గత ఎనిమిదేళ్లలో తెలంగాణ మూలధన వ్యయం ఐదున్నర రెట్లు పెరిగింది.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంతంతమాత్రమే
తెలంగాణతో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మూలధన వ్యయం అంతంతమాత్రమే. ప్రత్యేకించి ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ మూలధన వ్యయంలో అధమ స్థానంలో ఉన్నట్టు రిజర్వు బ్యాంకు నివేదిక స్పష్టం చేస్తున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.29,994 కోట్లుగా ఉన్న గుజరాత్ మూలధన వ్యయం గత ఎనిమిదేండ్లలో కనీసం రూ.60 వేల కోట్లు కూడా దాటలేదు. 2021-22లో ఆ రాష్ట్ర మూలధన వ్యయం రూ.56,568 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లోనూ మూలధన వ్యయం తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నది.