హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నందునే.. రాష్ట్రంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య అత్యధికంగా ఉన్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పనిస్థలంలో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘సాహస్’ కార్యక్రమాన్ని శుక్రవారం డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ శిఖా గోయల్తో కలిపి హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా హోంమంత్రి మాట్లాడుతూ.. మహిళలు పనిచేసే చోట వారిపై జరిగే వేధింఫులను సాహస్ అరికడుతుందని చెప్పారు. దేశంలోనే తొలిసారి సాహస్ కార్యక్రమం తెలంగాణాలోనే ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. అనంతరం డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. అత్యధిక మహిళా పోలీస్ అధికారులున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకత సాధించిందని తెలిపారు. ‘సాహస్’ ప్రారంభించడం రాష్ట్ర మహిళా భద్రతా విభాగంలో మరో మైలురాయిని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు శిఖా గోయల్, ఐజీ రమేశ్రెడ్డి, మిస్ ఇండియా మానస, సీఐఐ చైర్మన్ సీ శేఖర్రెడ్డి, కార్తికేయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఎండీ భగవతి బల్ద్వా తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నిజిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నకిలీ విత్తనాల అమ్మకాలపై 986 కేసులు నమోదు చేశామని, 1,938 మంది నిందితులను అరెస్టు చేశామని, 58 మందిపై పీడీయాక్ట్ నమోదు చేశామని వివరించారు.