Mahamood Ali on Reservations | సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలన్నారు. బుధవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ‘ రాష్ట్ర సామాజిక పరిస్థితులకనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి` అని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మహమూద్ అలీ తీర్మానం ప్రవేశపెట్టారు.
గతంలో దేశ ప్రజలు గుజరాత్వైపు చూసేవారని, ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గుజరాత్ను మించిపోయి తెలంగాణ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నదని చెప్పారు. 14 ఏండ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ గ్రామ గ్రామాన.. ఇల్లిల్లూ తిరిగి పలు సమస్యలపై అధ్యయనం చేశారన్నారు. అందుకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి దిశలో సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ మైనారిటీలను పట్టించుకోలేదని విమర్శించారు.
60 ఏండ్ల తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో ముస్లిం మైనార్టీ విద్యార్థులు చదువుల్లో ముందంజలో ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గతంలో 12 రెసిడెన్షియల్ స్కూళల్లో 40 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారని, తెలంగాణ ఏర్పాటైన మూడేండ్లలోనే 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటయ్యాయన్నారు. వాటిల్లో లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇది మామూలు విషయం కాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్తో ఈనాడు మైనారిటీ విద్యార్థులు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వెళ్లి చదువుకుంటున్నారని మహమూద్ అలీ గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా షాదీముబారక్ పథకం కింద మైనారిటీ మహిళలు రూ.లక్షకు పైగా ఆర్థిక సాయం అందుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 2.21లక్షల మంది అమ్మాయిలు లబ్దిపొందారని గుర్తుచేశారు. ఇమామ్, మౌజమ్లకు ప్రతి నెలా రూ.5000 వేతనం ఇస్తున్నామని, దీంతో 5000 మంది లబ్దిపొందుతున్నారన్నారు.
రాష్ట్రంలోని గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తూ. వాటికి రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, పంపినా కేంద్రం గిరిజనులను మోసగిస్తున్నదని దుయ్యబట్టారు. ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రమావత్ రవీంద్ర కుమార్ బల పరిచారు.
సమైక్య రాష్ట్రంలో గిరిజన జనాభా 6.6 శాతం ఉంటే, ఇప్పుడు 10 శాతానికి చేరుకుందని రమావత్ రవీంద్ర కుమార్ చెప్పారు. జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాలన్నారు. రిజర్వేషన్ల పెంపు కోరుతూ 2015 మార్చి మూడో తేదీన డాక్టర్ చెల్లప్ప కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపారసు చేసిందని గుర్తు చేశారు.2016 ఫిబ్రవరి 16న రాష్ట్ర క్యాబినెట్, అదే ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిందని చెప్పారు. కానీ గిరిజన రిజర్వేషన్ పెంచాలని రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం ప్రకటించడం విడ్డూరం అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాటి ఎమ్మెల్యేలుగా ఈ బిల్లుకు మద్దతు పలికారని గుర్తు చేశారు. కానీ కేంద్రానికి ప్రతిపాదనలే రాలేదని అబద్దపు ప్రచారం చేయడం తగదన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందని రమావత్ రవీంద్ర కుమార్ చెప్పారు. మరే విధంగా గిరిజన రిజర్వేషన్లు అమలుచేసినా కోర్టులో నిలబడదన్నారు. ఇది కేంద్రం చట్టం చేయడంద్వారానే సాధ్యమవుతుందన్నారు. గిరిజన గూడెలను గ్రామపంచాయితీలుగా చేసిన ఘనత టీఆర్దేనన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన గాంధీ అని రవీంద్ర కుమార్ కీర్తించారు. ఇప్పటికే 3180 తండాలను గ్రామపంచాయితీలుగా చేసిందన్నారు. అంతేకాక తాజా బడ్జెట్లో ఒక్కో పంచాయితీకి రూ. 25లక్షలు కేటాయించిందన్నారు.
ఎస్సీలను వర్గీకరిస్తూ పార్లమెంట్లో కేంద్రం తక్షణమే బిల్లు ఆమోదించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. బీజేపీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాయన్నారు. ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బల పరుస్తూ ఆనంద్ మాట్లాడారు. రిజర్వేషన్ల స్ఫూర్తికి బీజేపీ గండి కొడుతున్నదన్నారు. ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసేందుకు అడుగులేస్తున్నదని ఆరోపించారు. ఎల్ఐసీతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంతో రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు.
రాజ్యాంగం ప్రకారం సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చే వెసులుబాటు ఉందని మెతుకు ఆనంద్ అన్నారు. ఇంద్రాసహానీ కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచుకునే మినహాయింపు ఉంటుందని సుప్రీం కోర్టు వెల్లడించిన సంగతిని గుర్తుచేశారు. వన్ నేషన్-వన్ రేషన్.. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అంటున్న కేంద్రం వన్ నేషన్-వన్ రిజర్వేషన్ వ్యవస్థను ఎందుకు తేవడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 90 శాతానికి పైగా ఉన్నారని, అందుకనుగుణంగా రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు.