నెట్వర్క్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సంబురాలు చేసుకుంటున్నారు. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో మురిసిపోతున్నారు. క్వింటాల్కు ఇస్తున్న కమీషన్ను రూ.70 నుంచి రూ.140కి పెంచడం, ప్రతి డీలర్కూ రూ.5 లక్షల బీమా కల్పించడం, ఆథరైజేషన్ రెన్యువల్ 2 నుంచి 5 ఏండ్ల వరకు పెంచడం, డీలర్ చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున రూ.10 వేలు ఇవ్వడం, ప్రతి ఎంఎల్ఎల్ పాయింట్ దగ్గర వే బ్రిడ్జిల ఏర్పాటుచేయడం, కుటుంబానికి రూ.5 లక్షల వరకు దవాఖాన ఖర్చుల కోసం హెల్త్కార్డులు జారీచేయడం వంటి నిర్ణయాలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉండటామని రేషన్ డీలర్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అని నినదించారు. పలు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలతో కలిసి రేషన్ డీలర్లు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్, చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు.