హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అటవీ భూముల్లో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోరాదని హైకోర్టు హెచ్చరించింది. అటవీ శాఖ పరిధిలోని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ జోక్యం ఎకువ అవుతున్నదని, ఇది సరికాదని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ పట్టాలిస్తే అంగీకరించబోమని స్పష్టంచేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాజారాం గ్రామంలో అటవీ శాఖ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ఎం విట్టల్ విట్టు మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జూకంటి అనిల్కుమార్ విచారణ చేపట్టి అటవీ భూముల్లో జోక్యం చేసుకోవడం రెవెన్యూ శాఖకు అలవాటుగా మారిందని అన్నారు.
అటవీ భూముల్లో జోక్యం చేసుకునే అధికారం కలెక్టర్కు లేదని, పట్టాలు ఇవ్వాలంటూ కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యున్నత అధికారి ఆదేశించినా ఈ కోర్టు అంగీకరించదని స్పష్టంచేశారు. అటవీ భూములకు పట్టాల జారీ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు.