ముంబై, సెప్టెంబర్ 19: ప్రస్తుత పండుగ సీజన్లో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. జూలై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 2 లక్షల నుంచి 2.5 లక్షల సీజనల్, గిగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ ట్యాలెంట్ సొల్యుషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ విడుదల చేసిన నివేదికలోనూ ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో ఈ-కామర్స్, క్విక్ కామర్స్, రిటైల్, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ప్రయాణం, వినియోగదారుల సేవల రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఏడాదిలోనే అత్యధిక డిమాండ్ ఉండే ప్రస్తుత పరిస్థితుల కోసం సన్నద్ధమవుతున్నాయని ఈ నివేదిక పేర్కొన్నది.
ఈ పండుగ సీజన్ కార్మిక వర్గానికి ఒత్తిడి పరీక్షగా నిలువనున్నదని, యజమానులు మందుగానే నియామకాలు చేపట్టడం, సాంప్రదాయ ప్రతిభా కేంద్రాలుగా మారుతుండటం, సాంకేతిక ఆధారిత సేవలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటున్నాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ ఎస్వీపీ వరుణ్ సచ్దేవ తెలిపారు. గతంలో సీజనల్ ఉద్యోగాలకు స్వల్పకాలం మాత్రమే ఉపాధి అవకాశాలు లభించేవని, కానీ ప్రస్తుతం దీర్ఘకాలికంగా లభిస్తున్నాయన్నారు.
ప్రస్తుత పండుగ సీజన్లో ప్రతిభ కలిగిన వారికి డిమాండ్ అధికంగా ఉంటుందని సర్వే అంచనావేస్తున్నది. ప్రధానంగా పండుగ సీజన్ కంటే 12-14 వారాల ముందుగానే సీజనల్, గిగ్ వర్కర్ల నియామకాలు చేపడుతుంటాయని, ఈసారి మాత్రం ఇంతకంటే కొన్ని రోజులు ముందుగానే రిక్రూట్మెంట్లకు సిద్ధమయ్యాయని పేర్కొన్నది.