ఆరోగ్యానికి అసలు మాత్ర ఆహారమే. అందుకే వంటిల్లే ఆరోగ్యాలయం అంటుంది సంప్రదాయ వైద్యం. అయితే వంటింట్లో అన్నీ వండి మాత్రమే తినాలా… వండకుండా కూడా పాకాన్ని చేయొచ్చా… అలా అయితే అది ఆరోగ్యదాయకం, ఆమోద యోగ్యమేనా… లాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తి, వాటికి సమాధానాలూ చెబుతుంది ‘వంద వండని వంటలు’ పుస్తకం. ఇంకా చెప్పాలంటే పచ్చి కూరల్లోని పోషకాలు వండితే చచ్చిపోతాయనీ, అది జీవశక్తి లేని మృతాహారం కిందకి వస్తుందనీ, అసలైన అమృత ఆహారం వండని వంటలేననీ అంటారు రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి.
ఆయన మిద్దె తోటలు, పెరటి తోటల పెంపకాన్ని ఉద్యమంలా తీసుకుపోతూ సేంద్రియ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. అలాంటి కూరగాయలూ, ధాన్యాలూ, ఇతర దినుసులతో పొయ్యి మీద పెట్టకుండా వండగలిగే వంద వంటల్ని ఫేస్బుక్లో ప్రత్యేక శీర్షిక ద్వారా సేకరించి ముద్రించారారు. వీటిలో కొన్ని తానూ రాశారు. ఇందులో కూరలు, పచ్చళ్లు, పొళ్లు, స్వీట్లు, పానీయాలు… ఇలా అన్నీ ఉన్నాయి. హై క్యాల్షియం కూలింగ్ షేక్, మల్టీ గ్రెయిన్ ప్రొటీన్ ఐస్క్రీమ్, చియా ఫుడ్డింగ్లాంటి ఆసక్తికర రుచులూ పరిచయం చేశారు. అటు పనిని తగ్గిస్తూ ఇటు ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ వంటల గురించి తెలుసుకోవడం ఎవరికైనా అవసరమే!
సంపాదకులు: తుమ్మేటి రఘోత్తమ రెడ్డి
పేజీలు: 134, వెల: రూ.300
ప్రతులకు: రైతునేస్తం పబ్లికేషన్స్, హైదరాబాద్.
ఫోన్: 96767 97777, 72070 45979
-లక్ష్మీహరిత ఇంద్రగంటి