హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ సరఫరా ఆరోపణల కేసులో గోవాకు చెందిన ఎడ్విన్ నూన్స్ విడుదలకు కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టంలోని 37(బీ) (2) నిబంధన కింద కోర్టు సంతృప్తి చెందిన తర్వాత నిందితుడిని నిర్బంధంలో కొనసాగించడం సబబు కాదని పేర్కొన్నది. పోలీస్ కమిషనర్ వద్ద ఎడ్విన్ రూ.లక్ష డిపాజిట్ చేయాలని ఆదేశించింది. డ్రగ్స్ సరఫరా వల్ల సమాజానికి పెనుముప్పు ఏర్పడుతున్నదంటూ పోలీస్ కమిషనర్ గత ఏడాది డిసెంబర్లో జారీ చేసిన డిటెన్షన్ ఆర్డర్ను సవాల్ చేస్తూ ఎడ్విన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
ఎడ్విన్ తరపు న్యాయవాది ప్రద్యుమ్న కుమార్రెడ్డి వాదిస్తూ.. ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందని, ఎడ్విన్ వాటిని ఉల్లంఘించలేదని చెప్పారు. అయినప్పటికీ నగర పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్కుమార్ స్పందిస్తూ.. ఎడ్విన్ నేర ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ జారీచేసిన నిర్బంధ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోరాదని కోరారు. నిర్బంధ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకుంటే ఎడ్విన్ బయటకు వచ్చి తెలంగాణలో డ్రగ్స్ సరఫరాకు పావులు కదిపి సమాజానికి నష్టం చేకూర్చే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఇరువర్గాల వాదనలు కోర్టు.. నిర్బంధ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. ఎడ్విన్కు రెండు షరతులను విధించింది. సత్ ప్రవర్తనకు భరోసాగా పోలీస్ కమిషనర్ పేరిట ఏడాదిపాటు రూ.లక్ష డిపాజిట్ చేసి అందజేయాలని, నేరాలకు పాల్పడబోమని హామీ ఇస్తూ రెండు వారాల్లోగా అఫిడవిట్ వేయాలని ఎడ్విన్ను ఆదేశించింది. ఇదే తరహా ఉత్తర్వులను గోవాకు చెందిన డ్రగ్స్ సరఫరా కేసు నిందితుడు స్టీఫెన్ డీ సౌజా కూడా హైకోర్టు నుంచి పొందారు.