హైదరాబాద్, జనవరి 4 (నమసే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పలు రకాల ఆంక్షలు విధించామని, ఇవి ఈ నెల 10 వరకు అమల్లో ఉంటాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. దీంతో ఒమిక్రాన్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి చేసిన సిఫారసులను వివరిస్తూ నివేదిక అందజేయాలని నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఒమిక్రాన్ నియంత్రణ చర్యలపై నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 7న తదుపరి విచారణ నాటికి రెండు నివేదికలను స మర్పించాలని స్పష్టం చేసింది. కొవిడ్పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవా రం విచారణ జరిపింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యా ప్తి పెరుగుతున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. కోర్టు విచారణల ను, విద్యాబోధనను ఆన్లైన్లో నిర్వహించాలని కోరారు.
ఒమిక్రాన్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు పలు ఆంక్షలను అమలు చేస్తున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. మాస్కులు ధరించనందుకు గత ఏడా ది జూన్ 20 నుంచి డిసెంబర్ 23 వరకు 5,10,837 మందికి.. గత నెల 24 నుంచి ఈ నెల 2 వరకు 16,430 మందికి జరిమానా విధించామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించినవారిపై 907 కేసులు, నిర్దేశిత వేళల తర్వాత న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించినవారిపై 263 కేసులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించినవారిపై 644 కేసులు నమోదు చేశామని వివరించారు.
ఒమిక్రాన్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టిందని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ డీ శ్రీనివాస్రావు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.