హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన అక్రమారుల కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం భగ్నం చేసింది. సుమారు రూ.9000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల పాలు కాకుండా రక్షించింది. నకిలీ కోర్టు ఉత్తర్వులతో హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన కుట్రను ఉన్నత న్యాయస్థానంలోనే బట్టబయలు చేసి విజయం సాధించింది. శంషాబాబాద్లోని 181 ఎకరాల భూమి హెచ్ఎండీఏదేనని గత ప్రభుత్వం చేసిన వాదనను ఆమోదిస్తూ వేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు చెందిన 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు కుట్రలకు తెరలేపారు. సంబంధంలేని సర్వే నంబర్లను చూపి ఆ భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తూ వచ్చారు.
హెచ్ఎండీఏ అధికారిక లెకల ప్రకారం ఒక్కో ఎకరం విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో ఆక్రమణదారులు నకిలీ పత్రాలు సృష్టించిన విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. 1997లో హైకోర్టులో దాఖలైనవి రెండు వేర్వేరు వ్యాజ్యాలు అని, వాటిలో మధ్యంతర ఉత్తర్వులు కూడా నకిలీవేనని పేర్కొంది. దీనిపై స్పందించిన హైకోర్టు, జ్యుడీషియల్ రిజిస్ట్రీతో నివేదిక తెప్పించుకుంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రస్తావించిన అంశాలన్నీ వాస్తవమేనని రిజిస్ట్రీ సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. ఉభయపక్షాల వాదనలు విన్న హైకోర్టు గత నెల 18న తీర్పును వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 725/21లో 7 ఎకరాల 31 గుంటలు, సర్వేనంబర్ 725/23లోని 10 ఎకరాల 07 గుంటలు, సర్వేనంబర్ 725/24లో 12 ఎకరాల 34 గుంటలు.. సుమారు 30 ఎకరాల భూమిని తన పూర్వీకులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేసినట్టు హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమాకు చెందిన మహ్మద్ యాహియా ఖురేషీ, వట్టెపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్ వేర్వేరుగా దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది.
అకడి 181 ఎకరాల భూమి హెచ్ఎండీఏదేనని ప్రభుత్వం చేసిన వాదనను ఆమోదించింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా పిటిషనర్లు బోగస్ డాక్యుమెంట్లను సమర్పించడం మొదలుకొని 1990 సెప్టెంబర్ 4 నాటి హైకోర్టు ఉత్తర్వుగా పేరొంటూ1992లో టైప్ చేసిన ఆర్డర్ కాపీ, పిటిషనర్ సమర్పించిన ఇతర పత్రాలు బోగస్వేనని పేర్కొంది. పిటిషనర్లు ఉత్తర్వులు పొందేందుకు అర్హత లేదని, ఆ భూములన్నీ ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది. 2007, 2012 సంవత్సరాల్లో పంచాయతీ జారీ చేసిన పన్ను రశీదులు నకిలీవేనని పేర్కొంది. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాలేదు. శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటే, హైదరాబాద్ జిల్లాలో ఉన్నట్టుగా పిటిషనర్లు రసీదును సమర్పించారు. ప్రభుత్వం ఈ విషయాలపై కూలంకషంగా వివరించడంతో.. హైకోర్టు జ్యుడీషీయల్ రిజిస్ట్రీతో దర్యాప్తు చేయించుకొని సీల్డ్ కవర్లో నివేదిక తెప్పించుకుని విచారణను పూర్తిచేసింది. హైకోర్టులో పిటిషనర్లు 1997లో వ్యాజ్యాలనే దాఖలు చేయలేదని, 1998లో హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. హైకోర్టు ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోయినా తప్పుడు పత్రాలతో కోర్టునే మోసం చేయాలని ప్రయత్నించారని పేర్కొంది. ఈ మేరకు 54 పేజీల తీర్పును వెలువరించింది.
ప్రభుత్వ భూమిని తొలుత 30 ఎకరాలు ఆక్రమించి, ఆ తర్వాత మరో 150 ఎకరాలను కూడా తమ వశం చేసుకునేందుకు పిటిషనర్లు కుట్ర పన్నారు. హైకోర్టు 1998లో వెలువరించినట్టుగా పిటిషనర్లు సమర్పించిన సర్టిఫైడ్ కాపీల్లో నాటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ డీ పట్నాయక్ పేరును ఎండీ పట్నాయక్గా పేర్కొన్నారు. ఎండీ పట్నాయక్ పేరు గల వ్యక్తి ఇప్పటివరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయలేదు. ఆ కాలంలో జస్టిస్ ఎన్డీ పట్నాయక్ న్యాయమూర్తిగా పనిచేశారు. పిటిషనర్లు సమర్పించిన హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ నకిలీది. 1997లో ఆ రెండు పిటిషన్లు దాఖలే కాలేదు అని ఏజీ బీఎస్ ప్రసాద్ చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ట్రక్కు టెర్మినల్ నిర్మాణ కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 661, 662, 721, 725ల్లో ప్రభుత్వం 181ఎకరాలను 1987లో సేకరించింది. ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు సర్వహకులు ఉన్నాయి. దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఓ నర్సరీని కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మారెట్కు కేటాయించారు. కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటుచేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం 30 గుంటల భూమి కేటాయించారు. ఈ మేరకు అప్పట్లో అవార్డు (నంబర్ 1/1990, ఫైల్ నంబర్ ఐఏ 84/86)ను కూడా జారీ అయింది.
వీటిలో ‘పైగా’ భూములు కూడా ఉన్నాయి. 2011లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పట్టాదారులకు ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించింది. అందులో 30 ఎకరాల విషయంలో తమకు పరిహారం అందలేదంటూ 2021లో పిటిషన్లు దాఖలయ్యాయి. తప్పుడు తీర్పుల ప్రతులతో పిటిషనర్లు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారు. ఆ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో కోర్టు ధికార వ్యాజ్యాలను కూడా దాఖలు చేశారు. 1998లో హైకోర్టు పిటిషనర్లకు ఏవిధమైన ఉత్తర్వులు ఇవ్వలేదని తాజా తీర్పు ద్వారా వెల్లడైంది.